
తప్పని నిరీక్షణ
ఏడు నెలలుగా విడుదల కాని నిధులు..
వీధి వ్యాపారులకు 2024 డిసెంబర్ వరకు రుణాలు మంజూరు చేశారు. 2025 జనవరి నుంచి నేటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో రుణాలు మంజూరు చేయలేదని అధికారులు తెలిపారు. దీంతో వీధి వ్యాపారుఉలు రుణాల కోసం బ్యాంకులు, మెప్మా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వ్యాపారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.
మహబూబాబాద్: రుణాల మంజూరు కోసం వీధి వ్యాపారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏడు నెలలుగా మెప్మా కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, అందుకే రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) అధికారులు చెబుతున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న మెప్మా డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రం ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక ప్రగతికి దోహదపడుతోంది. కాగా, గత సంవత్సరం డ్వాక్రాగ్రూపులకు రూ.72 కోట్ల రుణాలు చెల్లించి, లక్ష్యం పూర్తి చేశారు.
వేల సంఖ్యలో వీధి వ్యాపారులు..
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి వ్యాపారుల వివరాలను నమోదు చేశారు.
● మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 5,556 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. తొర్రూరు 1,075మంది, మరిపెడ 1,230మంది, డోర్నకల్ లో 927మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. కాగా, ఆ వివరాలను నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. వీధి వ్యాపారుల కు కేంద్రం రుణాలను మంజూరు చేస్తోంది.
● 2024 డిసెంబర్ వరకు మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 5188 మందికి రూ.1,0000 చొప్పున రుణం మంజూరు చేసింది. అలాగే తొర్రూరులో 950మంది, మరిపెడలో 1166 మంది, డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 907 మందికి రుణాలు మంజూరు చేసింది.
● అలాగే మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 2016మందికి రూ .20,000 చొప్పున రుణం మంజూరు చేశారు. తొర్రూరులో 396మంది, మరిపెడలో 282మంది, డోర్నకల్లో 499 మందికి రుణాలు మంజూరు చేశారు.
● అదేవిధంగా మానుకోట మున్సిపాలిటీ పరిధి లో 567 మందికి రూ.50,000రుణం మంజూరు చేశారు. తొర్రూరులో 100మంది, మరిపెడలో 103మంది, డోర్నకల్లో 57 మందికి రుణాలను మంజూరు చేసింది.
రుణాలతో మహిళా సంఘాల ఉపాధి..
వీధి వ్యాపారుల పరిస్థితికి భిన్నంగా డ్వాక్రా గ్రూపు సభ్యులు రుణాలు తీసుకొని వ్యాపారులు కొనసాగిస్తున్నారు. పచ్చళ్ల తయారీ, మగ్గం వర్క్స్, కిరాణ షాపు, టెంట్హౌస్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు.
రుణాల మంజూరుకోసం వీధివ్యాపారుల ఎదురుచూపులు
ఏడు నెలలుగా విడుదల కాని నిధులు
డ్వాక్రా గ్రూపు రుణాల లక్ష్యం పూర్తి
ఉపాధి పొందుతున్న మహిళలు
నిధులు మంజూరు కాలేదు..
తీసుకున్న రుణాలను డ్వాక్రా గ్రూపు సభ్యులు, వీధి వ్యాపారులు కూడా సకాలంలో చెల్లించాలి. చెల్లిస్తే మళ్లీ తీసుకున్న దాని కంటే అదనంగా రుణం మంజూరు అవుతుంది. కొత్త సంఘాల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీధి వ్యాపారులకు గత ఏడాది డిసెంబర్ వరకు రుణాలు మంజూరయ్యాయి. కొత్త రుణాలకు నిధులు మంజూరు కాలేదు.
– విజయ, మెప్మా పీడీ

తప్పని నిరీక్షణ