
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్
మహబూబాబాద్ అర్బన్: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు–2025 కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీఈఓ రవీందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 17వరకు నామినేషన్ల రిజిస్ట్రేషన్, ఈనెల 20 వరకు దరఖాస్తుల తుది సమర్పణ, అలాగే ఆన్లైన్లో సబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే కాకుండా, ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5న) రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
గార్ల: ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం సీఎంను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ బరిలో నిలిచాయి. జిల్లాలో మొత్తం 457ఓట్లకు గానూ 405 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు పేరాల సంపత్రావు 184 ఓట్లతో అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. కార్యదర్శిగా సోమ పురుషోత్తం, కోశాధికారిగా బెజగం రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా మృత్యుంజయరెడ్డి, రామకృష్ణారావు వ్యవవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న వారు మాట్లాడుతూ.. అసోసియేషన్ బలోపేతం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు.
భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్