మిషన్‌ వాత్సల్య ఉపకారవేతనం కింద రూ.2 కోట్లకుపైగా నిధులు | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ వాత్సల్య ఉపకారవేతనం కింద రూ.2 కోట్లకుపైగా నిధులు

May 28 2025 11:57 AM | Updated on May 28 2025 12:50 PM

-

2024 జూలై నుంచి డిసెంబర్‌ వరకు 883 మందికి మంజూరు

 ప్రాధాన్యతా క్రమంలో అర్హుల గుర్తింపు

 

సాక్షి, వరంగల్‌ : అనాథ బాలురకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న ‘మిషన్‌ వాత్సల్య’ పథకం స్పాన్సర్‌షిప్‌ కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 883 మంది అనాథలకు 2024 జూలై నుంచి డిసెంబర్‌ వరకు రూ.2,11,92,000 నిధులు మంజూరయ్యాయి. ఈ ఉపకారవేతనం కోసం ఆరు జిల్లాల్లో కలిపి పదివేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రాధాన్యత క్రమంలో ఉన్న అర్హులైన 883 మంది అనా థలతోపాటు వారి గార్డియన్‌ల జాయింట్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఈ నిధులు అధికారులు జమ చేయనున్నారు. 

ప్రాధాన్యత క్రమంలో తల్లిదండ్రులు చనిపోయినవాళ్లు, హెచ్‌ఐవీ బాధిత తల్లిదండ్రుల పిల్లలకు, తండ్రి చనిపోయి తల్లి వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన పిల్లలకు, వితంతువుల పిల్లలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారు, అక్రమ రవాణా, దాడులకు గురైన వారు, బాల యాచకులు, బాల్య వివాహ బాధ్యులు అంటే 18 సంవత్సరాలలోపు బాలలకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం జమచేయనున్నారు. ఈ పిల్లల్లో కూడా ఎవరైనా మహాత్మా జ్యోతిబాపూలే, సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నవారికి అందనుంది. 

ఇటీవల కేంద్రం 2024 జూలై నుంచి డిసెంబర్‌ వరకు నిధులు విడుదల చేయడంతో అసలైన లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో వీటిని జమచేసేలా మహిళా, శిశు సంక్షేమ విభాగాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే రెండువేలకు పైగా దరఖాస్తులు వస్తే వారిలో ప్రాధాన్యత క్రమంలో అర్హులుగా 97 మందిని గుర్తించారు. మిగిలిన 46 మందిని స్పాన్సర్‌షిప్‌ కమిటీ పరిశీలించి కలెక్టర్‌కు నివేదించిన తర్వాతనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇతర ఐదు జిల్లాలో ఈ స్థాయిలోనే దరఖాస్తులు రాగా అర్హులను గుర్తిస్తున్నారు.

ఈ పథకంతో ఎంతో మేలు..

మిషన్‌ వాత్సల్య పథకం డెవలప్‌మెంట్‌ గోల్స్‌తో ముడిపడి ఉంటుంది. పిల్లల రక్షణ ప్రాధాన్యతలను గుర్తించడానికి ఇదొక చక్కటి ప్రణాళిక. బాలల న్యాయ సంరక్షణ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు బాలల హక్కులు, అవగాహనపై ‘ పిల్లలను వదిలేయవద్దు‘ అనే నినాదంతో ఈ పథకం పనిచేస్తుంది. కోవిడ్‌ 19 కారణంగా ఎటువంటి ఆదరణ లేని అభాగ్యులుగా మిగిలిన పిల్ల లకు చేయూతను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ వాత్సల్య‘ పేరుతో దీన్ని 2021 సంవత్సరంలో ప్రారంభించింది. దీనిద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 883 మంది అనాథలకు లబ్ధి చేకూరుతుందని ఆయా జిల్లాల సంక్షేమ విభాగాధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement