
నీడ మాటున నిధులు మాయం!
తొర్రూరు: గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలకు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాఽ దనం షేడ్నెట్ల పాలవుతోంది. తాత్కాలిక షేడ్నెట్లను ఏర్పాటు చేస్తుండడంతో చిన్నపాటి ఈదు రు గాలులు వీచినా చిరిగిపోతూ పనికి రాకుండా పోతున్నాయి. దీంతో తరచూ కొత్తవాటి కొనుగోళ్ల కోసం రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.
ఖర్చు ఇలా..
జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 10 నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. వేసవిలోనూ మొక్కల పెంపకం చేపడుతుండటంతో నీడ అవసరం ఉంటుంది. ఇందుకు షేడ్ నెట్(నీడ కోసం పరదా)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పంచాయతీ నిధులను కేటాయిస్తున్నారు. ప్రతీ నర్సరీకి రెండు నుంచి నాలుగు వరకు షేడ్నెట్ల అవసరం ఉంటుంది. ఒక్కో నెట్కు రూ.3 వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు షేడ్నెట్లకు రూ.6వేలు, నాలుగు నెట్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. జిల్లాలోని 461 నర్సరీల్లో ఏటా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
చిరిగిపోతున్న షేడ్నెట్లు..
కొనుగోలు చేస్తున్న షేడ్నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వచ్చినా చిరిగిపోతున్నాయి. గత ఏడాది కొనుగోలు చేసిన షేడ్నెట్లు ఇప్పటికే ఈదురుగాలులకు దాదాపు అన్ని చోట్ల చిరిగిపోయాయి. మొక్కల రక్షణకు మళ్లీ కొనుగోలు చేయక తప్పడం లేదు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను కానీ, ప్రత్యామ్నాయ పరికరాలు కానీ కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్గా నర్సరీలు నిర్వహించేవారు నీడ కోసం ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ నర్సరీలలోనూ నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటేటా కొనుగోలు చేసే అవసరం ఉండదు. దీనివల్ల ప్రజాధనం ఆదా అవుందని, ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
నర్సరీల్లో నాసిరకం షేడ్నెట్ల వినియోగం
చిన్నపాటి గాలులకే
చిరిగిపోతున్న నీడ పరదాలు
జిల్లాలో రూ.40లక్షల వరకు ఖర్చు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
షేడ్నెట్ల నాణ్యతపై దృష్టి సారిస్తాం. గతంలో గ్రా మ పంచాయతీ పాలకు లే కొనుగోలు చేసేవారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు పచ్చదనానికి వెచ్చించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన నెట్లను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కొన్ని పంచాయతీల్లో గతంలో కొనుగోలు చేసినవి, చిరిగిపోకుండా ఉన్నవాటిని వినియోగిస్తున్నారు.
– పూర్ణచందర్, తొర్రూరు ఎంపీడీఓ

నీడ మాటున నిధులు మాయం!