
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వానాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకు మించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాల కు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖ ర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ
నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే లా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొ న్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహు ల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస తదితరులు పాల్గొన్నారు.
2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు
గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలి పారు. రైతులు, భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

‘నకిలీ’పై ఉక్కుపాదం