ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు

May 30 2025 12:58 AM | Updated on May 30 2025 12:24 PM

-

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు

బోధనలో ప్యానల్‌ బోర్డులు వినియోగించేలా సన్నద్ధం

మూడు విభాగాలుగా శిక్షణలో మెళకువలు

సత్ఫలితాలు వస్తాయంటున్న ఉపాధ్యాయులు

సాక్షి, మహబూబాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతి, ఉచిత పుసక్తాలు, ఏకరూప దు స్తులు అందజేస్తున్నారు. ఇన్ని సౌకర్యాలతో పాటు ప్రతిభా వంతులైనఉపాధ్యాయులు బోధిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించేందుకే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈపరిస్థితిని మార్చాలంటే బోధన వి ధానంలోనే మార్పు రావాలి..వినూత్న పద్ధతిలో శాసీ్త్రయతను జోడించి బోధిస్తే మంచి ఫలితం ఉంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రధాన లక్ష్యాలు..

రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో సృజనాత్మకను పెంపొందించే వారిని గుర్తించి ప్రత్యేక మాడ్యూల్‌ తయారు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయుడి మూర్తిమత్వం వికసింపచేయడం, విషయ పరిజ్ఞానం, బోధనా పద్ధతులు, డిజిటల్‌ టెక్నాలజీ నేర్పించడం కీలక అంశాలుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు పది మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారిని ఉమ్మడి జిల్లాల వారీగా పంపించి శిక్షణ ఇప్పిస్తున్నారు. అదే విధంగా వారి ద్వారా శిక్షణ పొందిన జిల్లా స్థాయి ఇన్‌స్ట్రక్టర్లు ఎస్జీటీ నుంచి పీజీ హెచ్‌ఎం వరకు అన్ని స్థాయిల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.

డిజిటల్‌ బోధనపై దృష్టి

మారుతున్న పరిస్థితులు, అందిపుచ్చుకున్న విజ్ఞానం, ఆవిష్కరణలు జోడించి మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా శిక్షణ ఇన్నారు. ప్రధానంగా ఇంటరాక్ట్‌ ప్లాట్‌ ప్యానల్‌(ఐఎఫ్‌పీ), లర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఎల్‌ఎంఎస్‌), ఎడ్యుకేషన్‌ యాప్స్‌ను సద్వినియోగం చేసుకోవడం శిక్షణలో నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,9,10 తరగతుల కోసం ఎల్‌ఎంఎస్‌లో 246 అంశాలు, వాటికి ఉప అంశాలు మొత్తం 1000కి పైగా అందుబాటులో ఉంచారు. ప్రతీ పాఠశాలలో ప్యానల్‌ బోర్డు, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం ఉన్నందున ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలు, మెళకువలు, నూతన అవిష్కరణలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు వినూత్న బోధన చేయాల్సి ఉంటుంది.

శాస్త్రీయ‌ పద్ధతి జోడించి..

ప్రతీ సబ్జెక్టును బోధించేందుకు శాస్త్రీయ‌ పద్ధతిని జోడిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం పాఠశాలల్లో ఉన్న సైన్స్‌ కిట్స్‌ను ఉపయోగిస్తూ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ పాఠ్యాంశాలు బోధించాలి. ఆ పరికరాల వినియోగం కోసం ప్యానల్‌ బోర్డును వినియోగించి ఇంటర్‌ నెట్‌ ద్వారా ఆడియో, వీడియో చిత్రాలను చూపించాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఒక వైపు వినడం, మరోవైపు చూడటం, పరిశీలించడంతో విషయాలను సునాయసంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కార్పొరేట్‌గా దీటుగా బోధన

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయికి మించి బోధన జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సమకూర్చడమే కాదు.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి బోధన జరిపేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల మూర్తిమత్వం పెంపొందించడం, వయోజన విద్య, పిల్లల అపహరణ మొదలైన అంశాలపై కూడా శిక్షణలో చర్చ జరుగతుంది.

– రవీందర్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

మంచి ఫలితాలు వస్తాయి

ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణతో ఉపాధ్యాయులకు బోధన సులభతరం అవుతుంది. వినూత్న బోధన చేయడంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. పాఠ్యాంశంపై పట్టు వస్తుంది. దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయులందరూ నూతన ఒరవడితో బోధిస్తే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుంది.

– బి.అప్పారావు, జిల్లా సైన్స్‌ అధికారి

నూతన పద్ధతుల్లో తరగతులు

ఉపాధ్యాయులందరికీ వారి వారి సబ్జెక్టుల్లో పరిజ్ఞానం ఉంటుంది. నూతన పద్ధతులు, కొత్త ఆవిష్కరణలను జోడించి బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాడ్యూల్స్‌, యాప్స్‌ను వివరిస్తూ.. అవి ఎలా ఉపయోగించాలనేది శిక్షణలో ఉపాధ్యాయులు తెలుసుకుంటారు. దీంతో బోధన సులభం అవుతుంది.

– సురేశ్‌, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు1
1/2

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు2
2/2

ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement