
నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి, పెసర విత్తనాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విత్తనాలు అందించి రైతన్నకు నేస్తంగా నిలవడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
జూన్ 2న అందజేత..
సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఏ.జానయ్య ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనం...రైతన్నకు నేస్తం కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జిల్లాలోని 819మంది రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలను అందించేందుకు మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామస్థాయి క్లస్టర్ నుంచి ముగ్గురికి..
జిల్లాలోని 18 మండలాల్లో ముఖ్యంగా రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న గ్రామస్థాయి క్లస్టర్ నుంచి ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరిలో డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 1355, డబ్ల్యూజీఎల్ 1246, పెసర ఎంజీజీ 385 రకాలను ఎంపిక చేశారు. ఒక్కొక్క రైతుకు 10 కిలోల చొప్పున వరి విత్తనాలు, మూడు కిలోల చొప్పున పెసర విత్తనాలను అందజేయనున్నారు. జిల్లాలోని 273 గ్రామాల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒక రైతు నుంచి మరో రైతుకు..
వరి, పెసర విత్తనాలు ఇవ్వడమే కాకుండా వాటి సాగు, అనంతరం గుణగణాలు, పంట దిగుబడి వరకు పర్యవేక్షించడానికి ఒక శాస్త్రవేత్తల బృందం, చివరగా పంటకోత దశలో క్షేత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో రైతు నుంచి మరో రైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.మాలతి శాస్త్రవేత్తలు, కిశోర్ కుమార్, రాంబాబు, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనం.. రైతులకు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నారు.
జిల్లాలో 819మంది రైతులకు
వరి, పెసర విత్తనాల పంపిణీ
జూన్ 2న అందించేందుకు ఏర్పాట్లు

నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం