
సమ్మక్కసాగర్ @ డెడ్ స్టోరేజ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దేవాదుల ఇన్టెక్ వెల్ పంపింగ్కు జీవనాధారంగా పిలువబడే జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉండడంతో పంపింగ్కు అంతరాయం ఏర్పతుందనే చర్చ సాగుతుంది. పంపింగ్ నిలిచిపోతే దేవాదులకు దిగువన ఉన్న భీమ్ఘనపూర్, గొల్లబుద్ధారం వంటి రిజర్వాయర్లకు నీటి కష్టాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం సాగు నీటి అవసరం తగ్గినా.. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు ముందుచూపుతో బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తగ్గిన నీటి నిల్వలు..
సమ్మక్క సాగర్ బ్యారేజీ జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గి డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.76 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 83 మీటర్లు కాగా ప్రస్తుతం 72.30మీటర్లు ఉన్నాయి. బ్యారేజీలోకి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. బ్యారేజీలోని 59 గేట్లలో 58 గేట్లను క్లోజ్ చేసి ఒక గేటు నుంచి 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత కొంత కాలంగా పూర్తి గేట్లను మూసి నిల్వ చేసిన నీటిని దిగువ ప్రాంతాల తాగు నీటి అవసరాల నిమిత్తం వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు.
దిగువ ప్రాంతాలకు తప్పని తిప్పలు..
దేవాదుల ఇన్టెక్ వెల్కు దిగువన ఉన్న గొల్ల బుద్ధారం, భీమ్ ఘనపూర్, మొదలగు జలాశయాలకు నీటి ఇబ్బందులు తప్పేలా లేవు. దేవాదుల పంపింగ్ నిలిచిపోతే దిగువన ఉన్న జలాశయాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే ఆ జలాశయాల నీటిపై తాగు నీటికి ఆధారపడే ప్రాంతాలకు నీటి అవసరాలు తీర్చడానికి అధికారుల వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కనబడడం లేదు.
నిలిచిపోనున్న దేవాదుల పంపింగ్..
జలాశయానికి తగ్గుతున్న ఇన్ఫ్లో
బ్యారేజీలో తేలిన ఇసుక మేటలు
మున్ముందు తప్పని నీటి కష్టాలు
ఇన్టెక్ వెల్ నుంచి ఒక మోటారు ద్వారా పంపింగ్
తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం గ్రామ పరిధిలోని దేవాదుల ఎత్తిపోతల పంపింగ్ కొద్ది రోజుల్లో పూర్తిగా నిలిచిపోయే పరిస్థితికి నెలకొంది. ఇన్ఫ్లో లేకపోవడంతో గోదావరిలో నీటినిల్వలు తగ్గుతున్నాయి. దేవాదుల వద్ద 71.00మీటర్ల నీటి మట్టం వరకు పంపింగ్ చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం 71.75 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దేవాదుల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉండగా.. ఏప్రిల్లో 5,6 మోటార్ల ద్వారా పంపింగ్ చేసిన అధికారులు నీటి నిల్వలు తగ్గడంతో ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. వీటితోపాటు సమ్మక్క బ్యారేజీలోని ఒక గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అంటే రోజులో 547 క్యూసెక్కుల నీరు గోదావరిలో తగ్గిపోతుంది. కానీ, ఎగువ నుంచి బ్యారేజీలోకి 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది.
ఎగువ నుంచి నీరు రావడం లేదు
గోదావరిలోకి ఎగువ నుంచి నీరు రాకపోవడంతో బ్యారేజీలో నీరు తగ్గిపోతుంది. దేవాదుల వద్ద పంపింగ్కు సరిపడా నీరు అందకపోవడంతో ప్రస్తుతం ఫేజ్ 2లో ఒక మోటారు ద్వారా మాత్రమే పంపింగ్ చేస్తున్నాం. గోదావరిలోకి నీరు చేరితే మరో కొన్ని మోటార్లు ఆన్ చేసి పంపింగ్ చేస్తాం. బ్యారేజీ దిగువన గోదావరికి ఉన్న మిషన్ భగీరథ పంపింగ్ కొనసాగించడం కోసం బ్యారేజీలో ఒక గేటును ఎత్తి నీటిని వదులుతున్నాం.
– శరత్ బాబు, దేవాదుల డీఈఈ

సమ్మక్కసాగర్ @ డెడ్ స్టోరేజ్