
భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మూడోరోజు భద్రకాళిభద్రేశ్వరుల ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి.. అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం 11 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని మకరవాహనంపై ఊరేగించారు. సేవాకార్యక్రమాలకు వరంగల్ ఆర్యవైశ్య సంఘం దాతలుగా వ్యవహరించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మాదారపు రాజేశ్వర్రావు, ప్రోగ్రాం కన్వీనర్ తొనుపునూరి వీరన్న, మల్యాల వీరమల్లయ్య, అయితా గోపినాథ్, అల్లాడి వీరభద్రయ్య, గుండా హైమావతి, శ్రీరాం శైలజ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 7గంటలకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవంలో భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. అమ్మవారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. సంస్కృత పండితులు దోర్భల ప్రభాకరశర్మ, గోరుగస్తు భాస్కర వెంకటసుబ్రహ్మణ్యశర్మ శివకల్యాణ రాయభారం ఘట్టాన్ని వివరించారు.నేడు(శుక్రవారం) సాయంత్రం నిర్వహించే భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొనాలని, పాల్గొనేవారు రూ.516 చెల్లించాలని తెలిపారు. వారికి కల్యాణోత్సవ తలంబ్రాలు, శేషవస్త్రాలు, ప్రసాదం అందజేయనున్నట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
భద్రకాళి కల్యాణబ్రహోత్సవాల పూజాకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పాల్గొన్నారు. వారి వెంట కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భద్రకాళి చెరువు పూడికతీత, మాడవీధులు, దేవాలయం నుంచి కాపువాడ వరకు గల భద్రకాళి చెరువు కట్టను బలోపేతం చేస్తూ చుట్టూ గుట్టలను, చెరువు, పచ్చదనం సంతరించుకునేలా ఆలయప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కుడా అధికారులను కోరారు.
మకర, చంద్రప్రభ వాహనంపై
అమ్మవారి ఊరేగింపు
నేడు భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవం