బరిసె మెడపై కోసుకుపోయి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బరిసె మెడపై కోసుకుపోయి వ్యక్తి మృతి

May 2 2025 12:43 AM | Updated on May 2 2025 2:48 PM

ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ..

ఓ వాహనంపై ఉన్న బరిసె మరో వాహనంపై ఉన్న వ్యక్తి గొంతుకు కోసుకుపోవడంతో ఘటన..

మృతదేహంతో బంధువుల ఆందోళన

దంతాలపల్లి: ప్రమాదవశాత్తు పామాయిల్‌ చెట్టును చెక్కే బరిసె గొంతుకు కోసుకుపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. అప్పటివరకు తనతో కలిసి మాట్లాడుతూ వచ్చిన భర్త కళ్లెదుటే మృతి చెందడంతో ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఏనకుంట తండా గ్రామానికి చెందిన బానోత్‌ రమేశ్‌ (40)తన భార్య సునీతతో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వచ్చారు. 

ఆ గ్రామానికి చెందిన పెల్లి దామోదర్‌ రెడ్డి తన పామాయిల్‌ తోటలో పనిచేయడానికి బరిసెను పదును పెట్టించుకుని ద్విచక్రవాహనంపైన పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. గ్రామసమీపంలో రెండు వాహనాలు ఎదురుపడ్డాయి. ఎదురుగా వస్తున్న రమేశ్‌(40) గొంతుకు బరిసె కోసుకుపోవడంతో బైక్‌ పై నుంచి పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వారు చేరుకుని రమేశ్‌ను పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు దీప్తి, దీపిక ఉన్నారు.

మృతదేహంతో ఆందోళన

రమేశ్‌ మృతి విషయం తెలుసుకున్న తండావాసులు మృతదేహాన్ని దామోదర్‌ రెడ్డి ఇంటిఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. తొర్రూరు సీఐ గణేష్‌, దంతాలపల్లి ఎస్సై రాజు, నర్సింహులపేట ఎస్సై సురేష్‌ ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement