
రూ.లక్ష ఇస్తే ఉద్యోగం నీకే..!
జనగామ: హలో.. వైద్యారోగ్య శాఖ లో ఉద్యోగం కావాలా..? రూ.లక్ష పట్టుకురా.. బాధ్యత నాది అంటూ ఓ వ్యక్తి.. డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారిగా చెబుతూ ఓ నిరుద్యోగికి వాట్సాప్ కాల్ చేసి బేరసారాలు సాగించిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకరాం.. జనగామ జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు చిల్పూరు మండలం కృష్ణాజీగూడేనికి చెందిన మారపాక ప్రేమ్కుమార్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (ఎస్టీఎస్) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈక్రమంలో గత నెల 26, 27వ తేదీల్లో ఓ వ్యక్తి నుంచి రెండుసార్లు వాట్సాప్ కాల్ రాగా.. ప్రేమ్కుమార్ లిఫ్టు చేయలేకపోయాడు. మరోసారి కాల్ రాగా.. లిఫ్టు చేయడంతోనే ఎస్టీఎస్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా.. అంటూ ప్రేమ్ కుమార్ వివరాలను పూర్తిగా చెప్పాడు. ఉద్యోగం కావాలంటే రూ.లక్ష ముట్టజెబితే ఆ పోస్టు నీకే వస్తుందని నమ్మబలకడంతో అంత స్థోమత తనకు లేదని నిరాకరించారు. చివరగా వచ్చిన మెరిట్ లిస్టులో తన పేరు 6వ స్థానంలో ఉండగా, జాబితాలో అవకాశం రాకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. ఉద్యోగ నియామక ప్రక్రియలో 1 నుంచి 11 స్థానాల వరకు అర్హత కలిగిన నిరుద్యోగులు ఉన్నప్పటికీ, ఆ పైన ఉన్న నంబర్ వ్యక్తిని సెలెక్టు చేయడంపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొంతమంది వ్యక్తులు అడ్డదారిలో సెలక్ట్ చేస్తున్నారని, దాంతో అర్హులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై కలెక్టర్ విచారణ చేయించాలని ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. ఫోన్లో డబ్బుల డిమాండ్, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు తనకు అనుమానం ఉందని పేర్కొంటూ ప్రేమ్కుమార్ కలెక్టరేట్లో గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ.. ఉద్యోగ మెరిట్ జాబితాపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈ నెల 1వ తేదీ(గురువారం) వరకు అవకాశం ఇచ్చామని, ప్రస్తుతం ఫిర్యాదు చేసిన వ్యక్తి అభ్యంతరం తెలుపుతూ ఎలాంటి దరఖాస్తు ఇవ్వలేదని తెలిపారు. ప్రేమ్కుమార్కు అర్హత ఉంటే ఉద్యోగం వస్తుందని, తమ కార్యాలయం నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే విచారణ జరిపిస్తామన్నారు. ఎవరి ఫోన్, ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సైతం ఆరా తీస్తామని తెలిపారు.
వాట్సాప్ కాల్లో బేరసారాలు
డీఎంహెచ్ కార్యాలయ
ఉద్యోగిగా పరిచయం