
అనాథ బాలబాలికల జీవితాల్లో వెలుగులు
● బాలవికాస మహిళాభివృద్ధి సీనియర్ మేనేజర్ లత
కాజీపేట రూరల్ : సమాజంలో బాలవికాస సంస్థ అనాథ (వికాస) బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ మహిళాభివృద్ధి పథక సీనియర్ మేనేజర్ డి.లత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాస సంస్థలో ఆదివారం రూ.9 లక్షలతో 273 మంది అనాథ (వికాస) బాల బాలికలకు నూతన విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి పీజీ వరకు 9 జిల్లాల వారికి అవసరమైన విద్యాసామగ్రితోపాటు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలవికాస అనాథ బాలబాలికలకు చేయూతనిస్తూ వారికి అన్ని విధాలా తోడ్పటునందిస్తూ భవిష్యత్కు బంగారు బాటలు వేస్తోందన్నారు. బాలవికాస తెలుగు రాష్ట్రాల్లో మహిళాభివృద్ధి పథకంలో భాగంగా 1,600 మంది అనాథ బాలబాలికలకు చేయూత నిచ్చిందన్నారు. జనవికాస ప్రెసిడెంట్ లూర్థుమర్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ మనిషి జీవితంలో విద్య అత్యంత విలువైందన్నారు. బాలవికాస బాలబాలికల విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి పథక నుంచి సుజాత, జ్యోతి, అమూల్య, ఐటీ మేనేజర్ శివరాం, తదితరులు పాల్గొన్నారు.