
కేయూలో ‘పీవీ విజ్ఞాన పీఠం’ లేనట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో భారత మాజీ ప్రధానీ పీవీ నర్సింహారావు విజ్ఞాన పీఠం ఏర్పాటు ఇక లేనట్లేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో పీవీ నర్సింహారావు విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా హైదరాబాద్లో నిర్వహించిన పీవీ శతజయంతి ఉత్సవాల సభలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. విజ్ఞానపీఠం ఏర్పాటుకు ముందుకెళ్లాలని అప్పటి కేయూ వీసీ తాటికొండ రమేష్కు సూచించారు. కానీ, నిధులు మాత్రంను కేటాయించలేదు. ఈనేపథ్యంలో కేయూలో అడ్మిషన్ల డైరెక్టరేట్ కోసం నిర్మించిన నూతన భవనంలోనే పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటు చేస్తున్నట్లుగా గత వీసీ రమేష్ ప్రకటించారు. పీవీ విజ్ఞానీఠం పేరుతో ప్రారంభోత్సవం చేసి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఆ భవనాన్ని అడ్మీషన్ల డైరెక్టరేట్గానే కొనసాగించాలని ప్రస్తుత యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు.
రూ.3 కోట్లకు ప్రతిపాదన
అప్పటి వీసీ తాటికొండ రమేష్.. పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుకు రూ.3 కోట్లు అవసరమని అప్పటి ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. విజ్ఞానపీఠం ఏర్పాటుచేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై అప్పటి వీసీ అచార్యులు, రిటైర్డ్ ఆచార్యులతో సమావేశాలు ఏర్పాటుచేసి సలహాలు సూచనలు సేకరించారు. విజ్ఞానపీఠానికి భవనం, ప్రొఫెసర్, ఫీల్డ్లో విషయ సేకరణకు ఇద్దరు రీసెర్చ్ అసోసియేట్స్ను నియమించుకోవాలనేది ఆప్పటి వీసీ ప్రతిపాదన. ముఖ్యంగా పీవీ అమలుచేసిన ఆర్థిక సంస్కరణలు, ఫలితాలపైన పరిశోధనా పత్రాలు పబ్లిష్ చేసేందుకు జర్నల్ తేవాలని, సెమినార్లు నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నాటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. అయినప్పటకీ వీసీ రమేష్ పీవీ విజ్ఞాన పీఠం పేరిట సదస్సులు నిర్వహించారు. రాజనీతిశాస్త్ర విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం కృష్ణయ్యను నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్గా గత ఏడాది మే 15న నియమించారు. ఈఏడాది మేతో 16తో ఆయన పదవికాం ముగిసింది. దీంతో పీవీ నాలెడ్జ్సెంటర్ ఏర్పాటు కలగానే మిగిలిపోనుందని భావిస్తున్నారు.
ఒక భవనం.. రెండు కార్యాలయాలు..
కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన అడ్మిషన్ల డైరెక్టరేట్ భవనంలోనే పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుచేస్తున్నామని పీవీ నాలెడ్జ్సెంటర్ అని బోర్డు ఏర్పాటు చేశారు. కెహాబ్తోపాటుగా వివిధ నూతన భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా విజ్ఞాన పీఠం పేరుతో ప్రారంభం చేయించారు. ఆ తర్వాత భవనం వద్ద కేవలం బోర్డు మాత్రమే ఏర్పాటు చేశారు. విజ్ఞానపీఠం ఏర్పాటుచేయలేదు. ప్రస్తుతం డైరెక్టర్ పదవి కాలం ముగిసిపోయింది.
ఇక అడ్మిషన్ల డైరెక్టరేట్గా మార్పు
పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుకు నిధులు లేకపోవడంతో తాటికొండ రమేష్ అనంతరం కేయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్రెడ్డి.. ఆ నూతన భవనాన్ని కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్గానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు వెలవరించారు. వాస్తవంగా ఆ భవనాన్ని నిర్మించింది అడ్మిషన్ల డైరెక్టరేట్ నిధులతోనే. పాత అడ్మిషన్ల డైరెక్టరేట్ నుంచి ఫర్నీచర్ తదితర సామగ్రిని నూతన భవనంలోనికి తీసుకొచ్చారు.
ఆన్లైన్సెంటర్గా మార్చాలనే యోచన
కొన్నేండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్ కార్యాలయంలో అడ్మిషన్ల ప్రక్రియ లేదు. ఎప్సెట్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లాంటి ప్రవేశాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హెల్ప్లైన్సెంటర్గా మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ నూతనభవనాన్ని ఆన్లైన్ సెంటర్గా మార్చాలనే యోచనలో ఉన్నాం. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే వివిధ సెట్లను కేయూ ఆధ్వర్యంలో నిర్వహించుకోవచ్చు.
– ప్రొఫెసర్ సీజె. శ్రీలత,
కేయూ అడ్మిషన్ల డైరెక్టర్
నిధులకోసం ప్రతిపాదిస్తాం
కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఈప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతున్నాం. అందులోనే పీవీ విజ్ఞానపీఠం భవనంకోసం నిధులకు ప్రతిపాదిస్తాం. ఆ భవనాన్ని అడ్మిషన్ల డైరెక్టరేట్ కోసమే నిర్మించాం. విజ్ఞానపీఠం ఏర్పాటుచేయాలనే గత వీసీ యోచనతో బోర్డు ఏర్పాటు చేశాం. నిధులు లేకపోవడంతో పీఠం ఏర్పాటుచేయలేకపోయారు.
–వాసుదేవరెడ్డి,
కేయూ అభివృద్ధి అధికారి
ముగిసిన పీవీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ పదవీకాలం
ఇక అడ్మిషన్ల డైరెక్టరేట్గానే
నూతనభవనం

కేయూలో ‘పీవీ విజ్ఞాన పీఠం’ లేనట్లేనా?

కేయూలో ‘పీవీ విజ్ఞాన పీఠం’ లేనట్లేనా?