
అమాయక రైతులే లక్ష్యంగా..
వరంగల్ క్రైం : అమాయక రైతులే లక్ష్యంగా ప్రముఖ కంపెనీల పేర్లతోపాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురు నిందితులను టాస్క్ఫోర్స్, పరకాల, గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వీరి నుంచి సుమారు రూ.63.62 లక్షల విలువైన నకిలీ, గడువు తీరిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 8 వందల లీటర్ల గడ్డి మందుతోపాటు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన జయదీప్ గౌతమ్, హైదరాబాద్కు చెందిన ముద్దంగుల ఆదిత్య, పరకాల మండల నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి, ములుగు గణపురం మండల చెల్పూరు చెందిన అన్నం కుమారస్వామి, గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలికి చెందిన బెరిరెడ్డి మర్రిరెడ్డి, సంగారెడ్డికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసెఫ్ ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, పరకాల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రధాన నిందితుడు నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి ఇంటిపై దాడి చేసి నకిలీ, కాలం తీరిన పురుగు మందులు స్వాధీనం చేసుకుని విచారించారు. నిందితుడి సమాచారంతో హైదరాబాద్లోని మోహిదీపట్నం ప్రాంతంలో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేసి రూ.57.44 లక్షల నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం చేసుకోవడంతో పాటు జయదీప్ గౌతమ్, ఆదిత్య, కుమారస్వామిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఘటనలో గీసుకొండ పీఎస్ పరిధిలోని ఎల్కుర్తి హవేలీ ప్రాంతంలో బెరిరెడ్డి మర్రిరెడ్డి ఇంటిపై దాడి చేసి కిలో నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని విచారించారు. నిందితుడి సమాచారంతో సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసెఫ్ ఇళ్లలో తనిఖీ చేసి సుమారు రూ.6.18 లక్షల విలువైన 166 కిలోల నకిలీ విత్తనాలతోపాటు 8 వందల లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, పరకాల, మామునూరు ఏసీపీలు వెంకటేశ్, సతీశ్బాబు, ఇన్స్పెక్టర్లు బాబులాల్, సార్లరాజు, రంజిత్, క్రాంతికుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ఫోర్స్, పరకాల ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందుల విక్రయం
రెండు ముఠాలకు చెందిన ఏడుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్