
పెండ్యాల రైల్వే స్టేషన్లో తనిఖీలు
కాజీపేట రూరల్: కాజీపేట ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెండ్యాల రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీఐ సి.ఛటర్జీ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛటర్జీ మాట్లాడుతూ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై దుండగులు రాళ్లతో దాడికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు 10 రోజుల నుంచి పెండ్యాల స్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లో రైల్వే గేట్లు, ట్రాక్ పాయింట్ల వద్ద తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాజీపేట–పెండ్యాల రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతూ అనుమానాస్పదంగా కనిపించిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఏఎస్సై జావిద్ ఇక్బాల్, కానిస్టేబుల్ నితిన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్పై కేసు
కాజీపేట రూరల్ : శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కుమారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్తో పాటు మరో ఏడుగురిపై కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్క తుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలతో కలిసి వెళ్లే క్రమంలో ఉప్పల్ రైల్వే గేట్ వద్ద ట్రాక్పై ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సిరికొండ ప్రశాంత్, తాటి జనార్ధన్, గురుకుట్ల కిరణ్, ఈర్ల రాజు, కన్నెహల ప్రకాశ్, శశికాంత్గౌడ్, బి.ఆరిపూర్ణపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాలు వెళ్లకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆటంకాలు సృష్టించాయని ప్రశాంత్ ఆరోపించారు. భూపాలపల్లి నుంచి సభకు వెళ్లే వాహనాలను ఉప్పల్ మీదుగా మళ్లించి ఉద్దేశపూర్వకంగా దాదాపు రెండు గంటలకు పైగా రైలు నిలిపివేశారని, తద్వారా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయన్నారు. దీంతో కేంద్ర,రాష్ట్రాల వైఖరి నిరసిస్తూ తాము రైల్వే గేట్వద్ద ఆందోళన చేపట్టామని, ఇందుకుగాను తనతో పాటు 14 మందిపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

పెండ్యాల రైల్వే స్టేషన్లో తనిఖీలు

పెండ్యాల రైల్వే స్టేషన్లో తనిఖీలు