
ఇందిరమ్మ ఇళ్లతో శాశ్వత నీడ
మహబూబాబాద్ రూరల్: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో శాశ్వతంగా నీడ కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మురళీనాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం, అధికారులు సూచించిన విధంగా ఇల్లు కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు దేవరం ప్రకాష్ రెడ్డి, మిట్టకంటి రామిరెడ్డి, శంతన్ రామరాజు, నీరుటి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్