
క్షయ రహిత సమాజమే లక్ష్యం
నెహ్రూసెంటర్: క్షయ వ్యాధిని (టీబీ) అంతమొందించేందుకు క్షయ రహిత సమాజమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. 2030 నాటికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతుంది. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంతో వంద రోజుల టీబీ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు వైద్య సిబ్బంది రంగంలో దిగారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, టీబీ రోగులకు పోషకాహారానికి ఆర్థిక సాయం అందించనున్నారు. జిల్లాలో టీబీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. డిసెంబర్ 2024 నుంచి మే నెల వరకు 661 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ టీబీ నివారణకు గ్రామాల్లో వైద్యసిబ్బంది స్క్రీనింగ్ చేపట్టారు.
టీంలుగా ఏర్పడి...
జిల్లాలో 483 గ్రామ పంచాయతీల్లో ఇతర వ్యాధులతో పాటు క్షయవ్యాఽధి స్క్రీనింగ్కు రెండు టీంలుగా ఏర్పాటు చేసి తెమడ పరీక్షలు, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయవ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులను 102 వాహనాల ద్వారా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, సీహెచ్సీలకు తరలించి ఉచితంగా మందులను ఆరు నెలల పాటు అందజేస్తున్నారు. జిల్లాలోని విద్య, గ్రామీణాభివృద్ధి, సమాచార పౌర సంబంధాలు, ఐసీడీఎస్, మున్సిపాలిటీ, మెప్మా శాఖలతో కలిసి గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
అందని ప్రోత్సాహం...
క్షయ వ్యాధిగ్రస్తులకు ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా పౌష్టికాహార కొనుగోలుకు ప్రతీ నెల రూ.1,000 అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ నేటి వరకు పౌష్టికాహారం కోసం అందించే రూ.1,000 అందలేదని సమాచారం. రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ క్షయ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి. క్షయ రహిత సమాజ ఏర్పాటుకు తమ వంతు కృషి చేయాలి.
– డాక్టర్ విజయ్కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్
‘టీబీ ముక్త్ భారత్’ పేరుతో
వంద రోజుల ప్రణాళిక
రోగులకు 6నెలల పాటు ఉచిత
మందులు, ఆర్థికసాయం
జిల్లాలో క్షయవ్యాధిగ్రస్తుల వివరాలు
సంవత్సరం కేసులు
2023 1,349
2024 1,287
2025 (మే నెల వరకు) 661

క్షయ రహిత సమాజమే లక్ష్యం