
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం
చిన్నగూడూరు: దేశ రక్షణలో ఎన్నో త్యాగాలు చేస్తున్న సైనికుల సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాల్గొని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి శనివారం గ్రామానికి చేరిన జయ్యారం గ్రామానికి చెందిన దేశగాని లక్ష్యయ్య తనయుడు వీరజవాన్ దేశగాని రవిగౌడ్కు గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల పోరాటాలతోనే ప్రజలు సంతోషంగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ చీకటి మహేష్గౌడ్, సింగారం సతీష్, ఘనగాని వేణు, సారెడ్డి రాణిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా మహాసభలను
జయప్రదం చేయాలి
నెహ్రూసెంటర్: ఈ నెల 8వ తేదీన జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టెబోయిన శ్రీనివాస్, చింతకుంట్ల వెంకన్న శనివారం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో ఉపాధి పనులు చేపట్టాలని, ఏడాదికి 200 పని దినాలను కల్పించి రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెహ్రూసెంటర్: జిల్లాకేంద్రంలోని 11కేవీ ఫీడర్పై చెట్ల కొమ్మలు కొట్టుట, ఇతర విద్యుత్ సమస్యల పరిష్కరించేందుకు పాత బజారులో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్శాఖ ఏఈ సంగీత శనివారం తెలిపారు. నందినగర్, గుండ్లకుంట కాలనీ, స్ధూపం కాలనీ, ఆర్టీసీ కాలనీ, రాహుల్నగర్, కంకరమిల్, చిట్యాల గోపయ్యనగర్, ఎటిగడ్డ తండా, రాంచంద్రాపురం కాలనీ, బస్టాండ్ రోడ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ కాలనీ, ఈదులపూసపల్లి రోడ్డు ఏరియాలో విద్యుత్ను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
‘స్పోకెన్ ఇంగ్లిష్’ను వినియోగించుకోవాలి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను వినియోగించుకోవాలని సెల్ట్ (సెంటర్ ఫర్ లాంగ్వేజ్ ఫర్ ఇంగ్లిష్ టీచింగ్) డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సెల్ట్ ఆధ్వర్యంలో ఆరువారాల స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, గృహిణులు, బోధన, బోధనేతర ఉద్యోగులు ఈనెల 14 తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులకు ఫీజు రూ.1,000, బయటివారికి రూ.1,500లు ఉంటుందని, ఫీజును యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాన్ యూనివర్సిటీ ఫండ్ ఖాతాలో చెల్లించి పేర్లు నమోదు చేసుకో వాలని సూచించారు. ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వా రు వినియోగించుకోవాలని కోరారు.
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి, 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికల్లో 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 6ఇంటు10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఎత్తు, బరువు, మొత్తం 9 విభాగాల్లో 27 మార్కులకు ఫిజికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 01, 2016 నుంచి ఆగస్టు 30, 2017 మధ్య జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్లైన్లో ఈనెల 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.