
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
● ధర్మకంచలో విషాద ఘటన
జనగామ : జనగామ పట్టణం ధర్మకంచకు చెందిన పానుగంటి ప్రవీణ్ సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సువార్త ఫిర్యాదు మేరకు సీఐ దామోదర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంధువుల వివాహ వేడుకలకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఈ నెల 24న హైదరాబాద్కు వెళ్లారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ప్రవీణ్ జనగామకు వచ్చాడన్నారు. సభకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, భార్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు. సోమవారం ప్రవీణ్కు అతని భార్య ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయక పోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఉరేసుకుని ఉన్నట్లు భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలుపగా, అందరు జనగామకు వచ్చారు. భర్త చనిపోయిన విధానం, అక్కడి పరిస్థితులు సహజ మరణంగా లేదని మృతుడి భార్య సువార్త ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి తలుపులు తీసి ఉండడం, లాక్ కూడా వేసుకోక పోవడం అనుమానంగా ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని, ప్రవీణ్ మృతిపై సెల్ఫోన్ కాల్ డాటా ఆధారంగా సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. సీఐ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో పంచనామా చేసి, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కుటుంబంలో విషాదం
బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ అనుమానాస్పద మృతితో కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ, మిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఎల్కతుర్తి సభ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి ఇంటికి తిరిగి వచ్చే వరకు కలిసి ఉన్న ప్రవీణ్ ఒక్కసారిగా విగత జీవిగా కనిపించడంతో పార్టీ నాయకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.