మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి శ్రీసుశమీంద్ర తీర్థులు శతమహోత్సవ మధ్యారాధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో సుశమీంద్ర తీర్థుల మధ్యారాధన వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ముందుగా వేద పఠనంతో సుశమీ ంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించి అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలో సుశమీంద్ర చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. గురుసార్వభౌమ సాహిత్య మండలి భజనలు, కీర్తనలు, వేద పాఠశాల విద్యార్థుల వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య రథయాత్ర వైభవంగా సాగింది.
సుశమీంద్ర తీర్థులకు టీటీడీ పట్టువస్రాలు
శ్రీమఠంలో శ్రీ సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ మధ్యారాధన కార్యక్రమాలు వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆనవాయితీగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా శ్రీమఠం మహాద్వారం నుంచి శ్రీ మఠం అధికారులు, సంస్కృత పాఠశాల వేద విద్యార్థులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. టీటీడీ అధికారి రామకృష్ణ నేతృత్వంలో శ్రీ సుశమీంద్రుల తీర్థుల ఆరాధన సందర్భంగా పట్టు పస్త్రాలు సమర్పించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు టీటీడీ పట్టువస్త్రాలను శ్రీ రాఘవేంద్రుల మూలబృందావనం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టి మహామంగళ హారతులు గావించారు. అనంతరం శ్రీసుశమీంద్రతీర్థులకు పీఠాధిపతి ఆరాధన చేపట్టారు.


