కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పార్ట్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రం వద్దకు ఆయన నేరుగా వెళ్లి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని, మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. యూనివర్శిటీ పరిధిలో పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, వాటికి మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రిజిస్ట్రార్ కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను అకడమిక్ యాక్టివిటీ మరింత మెరుగుపరుస్తూ రీసెర్చ్ ఆక్టివిటి వైపు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఆయన వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింధియా శుభప్రద, యూనివర్సిటీ స్పెషల్ అబ్జర్వర్ ప్రొఫెసర్ రంగయ్య, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్, పరీక్షల నిర్వహణ సిబ్బంది ఉన్నారు.
అబ్దుల్ కలాం స్కూల్ ప్రవేశ పరీక్ష రద్దు
కర్నూలు సిటీ: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్ ప్రవేశ పరీక్షను డీఈఓ ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు ఆ స్కూల్ హెచ్ఎం ఎస్.ఎం హూసేన్, పెరెంట్స్ కమిటీ చైర్మన్ టి.బిల్కీస్ బాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష ఈ నెల 18వ తేదీన నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.100 ఎంట్రీఫీజు చెల్లించారు. ఈ సొమ్మును తిరిగి ఇవ్వనున్నట్లు వారు వెల్లడించారు. ప్రవేశాలపై ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.


