సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలి
డీహెచ్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
కర్నూలు(సెంట్రల్): దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే గుర్తించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునః సమీక్ష చేయా లని కోరారు. శనివారం డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి సి.మహేష్ అధ్యక్షతన ఎస్టీయూ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, సీనియర్ న్యాయవాది వై.జయరాజు, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.క్రాంతినాయుడు, క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు బి.జాషువా దానియేల్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, జిల్లా నాయకులు విజయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల్ శేఖర్, సీనియర్ న్యాయవాది జయరాజు మాట్లాడుతూ...డాక్టర్ బీఆర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటి పైకి వచ్చి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. అయితే కాలనుగుణంగా రిజర్వేషన్లను మతం ప్రతిపాదికన అన్వయించడం అన్యాయమన్నారు. దళితుడు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించుకోవాలన్నారు. అత్యంత వెనుకబడిన దళితులు క్రిష్టియన్ మతం స్వీకరించినంత మాత్రాన ధనికులు కారన్నారు. వారి జీవన విధానాన్ని సమీక్షించి రిజర్వేషన్ కొనసాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్షకు వెళ్లాలని కోరారు.


