ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక ఆదేశాల మేరకు స్థానిక చేనేత విభాగం నాయకులు సోమవారం పట్టణంలోని సోమప్ప సర్కిల్లో నిరవదిక దీక్షలను ప్రారంభించారు. అంతకుమునుపు పద్మశ్రీ మాచాని సోమప్ప వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షలో కూర్చున్న మాజీ కౌన్సిలర్లు, చేనేత నాయకులు కామర్తి నాగేషప్ప, ఎంకే శివప్రసాద్, మీసాలనీలకంఠ, విశ్వనాథ్ రమేష్, చేనేతమల్లి, మాచాని రఘు, రఘువీర, కరె రాము, గురుమూర్తిలకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, మాజీ వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్లు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుబాబు, పాలశ్రీనివాసరెడ్డి, గురువయ్య, మాబ్బాష తదితరులు పాల్గొన్నారు.


