వీధినపడ్డాం..
డోన్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఉపాధి సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధంతో క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు గ్యాస్ కొరత ఏమాత్రం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రకటనలు ఇస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నా అడిగేవారు లేరు. యుద్ధం పేరుతో డెలీవరి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మరో వైపు కమర్షియల్ సిలిండర్లు డెలీవరి దాదాపుగా నిలిపివేయడంతో హోటళ్ల నిర్వాహకులకష్టాల పాలయ్యారు. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. మరికొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిలను నిర్మించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక చిరు తిండ్ల బండ్ల వ్యాపారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారు, తోపుడు బండ్లపై ఆహార పదార్థాలు విక్రయించే వారు ఉపాధి లేక వీధిన పడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో అనధికారిక గోడౌన్లను ఏర్పాటు చేసుకొని ఒక్కో గ్యాస్ సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్యాస్ సంక్షోభం మూలంగా చిన్న చిన్న టిఫెన్సెంటర్ల నిర్వాహకులు రోడ్డున పడ్డాం. గ్యాస్ కొరతతో హోటల్ నడపటం కష్టంగా మారింది. ఎంతో మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. మాలాంటి వాళ్లు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి.
–బింగి శ్రీనివాసులు,
చిరు హోటల్ నిర్వాహకులు
ఇరాన్ యుద్ధంతో
గ్యాస్ సిలిండర్ల కొరత
హోటల్ రంగం కుదేలు
టిఫిన్ సెంటర్లు మూతపడి
నిర్వాహకులు విలవిల
చోద్యం చూస్తున్న టీడీపీ ప్రభుత్వం


