పరీక్ష కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రం తనిఖీ

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

ఉయ్యాలవాడ : మండల కేంద్రమైన ఉయ్యాలవాడ మోడల్‌స్కూల్‌లో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం విద్యార్థులు రాస్తున్న సోషల్‌ పరీక్షను ఆమె పరిశీలించారు. అనంతరం పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు, తదితర అంశాలపై ఎంఈఓ వీరప్రతాప్‌రెడ్డితో ఆరా తీశారు. నలుగురు విద్యార్థులు స్క్రైబర్‌ సహాయంతో పరీక్షలు రాస్తున్నారని, ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఈమె వెంట చీఫ్‌ వెంకటేశ్వరరావు, డిపార్ట్‌మెంటల్‌ అధికారి విప్రనారాయణాచారి, సిట్టింగ్‌ స్క్వాడ్‌ శ్రీనివాసులు ఉన్నారు.

పీఆర్‌సీ కోసం ఒక రోజు నిరాహార దీక్ష

కర్నూలు సిటీ: పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పా టు చేయాలని, 29 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని కోరారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాల ని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపునకు రోడ్‌ మ్యాప్‌ ప్రకటించి,నిర్ణీ త గడువులోగా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, నవీన్‌ పాటి, గౌరవాధ్యక్షులు దా వీదు, సహాధ్యక్షుడు హేమంత్‌కుమార్‌, ఆర్థిక కార్యదర్శి యోహోషువ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృతి

నందవరం: మండల పరిధిలోని ముగతి గ్రామ సమీపంలోని ఎంఆర్‌బీ ఇట్టుకల బట్టి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్షావలి(40) మృతి చెందాడు. మరొక విద్యార్థి నవీన్‌కుమార్‌ గాయపడ్డాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి, స్థానికులు తెలిసిన వివరాలు..సోమవారం మంత్రాలయం మండలం, రచ్చమర్రి గ్రామానికి చెందిన షేక్షావలి బైక్‌పై మంత్రాలయం మీదుగా ఎమ్మిగనూరుకి బయలుదేరాడు. నదికై రవాడికి చెందిన తలారి అంజలి కుమారుడు నవీన్‌కుమార్‌ (7వ తరగతి విద్యార్థి) అతని బైక్‌పై లిఫ్ట్‌ అడిగి ఎక్కాడు. అదే సమయంలో ఎమ్మిగనూరు నుంచి ఓ ఆటో కోసిగి మండలం, దొడ్డి బెళగల్‌కు వస్తోంది. బైకు, ఆటో ఇట్టుకల బట్టి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న షేక్షావలి, నవీన్‌కుమార్‌కి తీవ్ర గాయలయ్యా యి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్షావలి మృత్యువాత పడ్డాడు. నవీన్‌కుమార్‌ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య దస్తగిరమ్మ, గాయపడ్డ నవీన్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అప్పుల బాధతో

యువరైతు ఆత్మహత్య

ఎమ్మిగనూరురూరల్‌: అప్పుల బాధతో పురుగుమందు తాగి బోయ మా రెప్ప (27) అనే యువ రైతు సోమవారం తెల్లవారుజామున మృతి చెందా డు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడివెళ్ల గ్రామానికి చెందిన బోయ పెద్దయ్య కుమారుడు బోయ మారెప్ప (27) తనకు ఉన్న 2 ఎకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగుచేశాడు. పెట్టుబడి కోసం బ యట వ్యక్తుల దగ్గర రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. పంట సరిగ్గా రాకపోవటంతో అప్పు లు ఎలా తీర్చాలో తెలియక నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. బోయ మారెప్పకు భార్య, ఇద్దరు కమా రులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆదు కోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారులకు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement