కర్నూలు(సెంట్రల్): పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో జనగణన–2027 ప్రక్రియ నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. జి.పుల్లయ్య కాలేజీలో ఫీల్డ్ ట్రైనర్లకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణలో బోధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ముందుగా హౌస్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని కచ్చితంగా గుర్తించి ఎటువంటి పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయలన్నారు. ఫీల్డ్ ట్రైనర్లుగా ఉన్న ఉపాధ్యాయులు తమ కింద పనిచేసే ఎన్యూమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెన్సస్ అధికారి దీపక్ భరద్వాజ్ పాల్గొన్నారు.


