శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకులు జరిపించారు. స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, సభ్యులు ఏఈవో, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


