కర్నూలు: జిల్లాలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు విస్తృతం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కలసి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి చౌడేశ్వరి ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న 10 గ్యాస్ ఏజెన్సీలు, 88 హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వలను గుర్తించి 201 కేసులు నమోదు చేశారు. లబ్దిదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా చేయకుండా కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ గ్యాస్ను వ్యాపార అవసరాలకు హోటల్ నిర్వాహకులు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6ఎ కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.


