‘పల్లె పండుగ’కు నిధులు కరువు!
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఏడు నెలలు పూర్తి అవుతున్నా నిధులు విడుదల కాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత పల్లెపండుగకు సిద్ధం అవుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడత పల్లెపండుగ పనులు 2024 నవంబరులో శ్రీకారం చుట్టి 2025 మార్చితో ముగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంటు కింద సీసీ రోడ్లు, పశువుల షెడ్లు నిర్మించారు. అలాగే ఉపాధి నిధులతో పండ్లతోటల అభివృద్ధి, సోప్ఫిట్స్, నీటితొట్లు, ఫారెస్ట్ నర్సరీలు చేపట్టారు. ఇందులో ఓ ఒక్క కార్యక్రమానికి నిధులు నిధులు విడుదల కాలేదు.
బిల్లులకు గ్రహణం
మొదటి విడత పల్లెపండుగ కింద చేపట్టిన పనులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇందులో కర్నూలు జిల్లాకు రూ.85 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.65 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లులే 75 శాతం (రూ.100 కోట్ల) వరకు ఉన్నాయి. పనులు పూర్తి చేసిన తర్వాత నిధుల విడుదల కోసం పండ్ ట్రాన్స్ఫల్ ఆర్డర్ (ఎఫ్టీవో) జనవరిలో జనరేట్ చేశారు. అయితే ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఎం.బుక్ రికార్డు చేసి ఎప్టీవో జనరేట్ చేయని వాటికి సంబంధించి మరో రూ.30 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
నష్టాలే మిగిలాయి!
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణం, పండ్లతోటల అభివృద్ధి, పశువుల నీటి తొట్లు, సోక్ పిట్స్ నిర్మించుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. 2024–25 సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 1,200, నంద్యాల జిల్లాలో 850 పశువుల షెడ్లను. అప్పులు తెచ్చి నిర్మించుకున్నారు. వారంతా నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పండ్లతోటల అభివృద్ధికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు రూ.25 కోట్లు, పశువుల షెడ్లుకు రూ. 22 కోట్లు, నీటితొట్ల( 900)కు దాదాపు రూ.2.5 కోట్లు, సోక్ఫిట్స్(4000)కు రూ.2.40 కోట్లు, ఫారెస్ట్ నర్సరీలకు రూ.2.20 కోట్లు విడుదల కావాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఎఫ్టీవో జనరేట్ అయి నెలలు గడుస్తున్నా.. అతీగతీ కూడా లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వెల్లువెత్తుతోంది.
ఉమ్మడి జిల్లాలో
రూ.150 కోట్ల బకాయిలు
నిధులు ఇవ్వకుండామళ్లీ
పల్లెపండుగ–2 అంటూ హడావుడి
పనులు చేయించాలని
అధికారులపై ఒత్తిడి
ఈ ఏడాది సీసీ రోడ్ల నిర్మాణం లేనట్టే!


