
పేలుతున్న టపాసుల ధరలు!
కర్నూలు(సెంట్రల్): బాణాసంచా ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ రకం టపాసులను ముట్టుకున్నా షాక్ కొడుతున్నంత పని అవుతోంది. దీంతో దీపావళి పర్వదినాన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అటువైపు చూడాలంటే భయపడాల్సి వస్తోంది. కనీసంగా రూ.5 వేల వరకు క్రాకర్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అయోమయంలో ఉన్నారు.
స్థానికంగా రేట్లు పెంచి..
దీపావళి పండుగ రోజున నరకాశుని వధ కోసం బాణాసంచాను పేల్చి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాణాసంచాను కుటుంబ సభ్యులందరూ ఒకచోటా చేరి పేల్చడం పారిపాటైంది. ఈ క్రమంలో ప్రజలకు అవసరమైన బాణాసంచాను అందుబాటులో ఉంచేందుకు 86 ఏళ్ల నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలో క్రాకర్స్ మర్చంట్ అసోసియేషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, పత్తికొండ, ఆదోనిలలో ప్రజలకు అనువైన చోటా స్టాళ్లను ఏర్పాటు చేసి బాణాసంచాను పరిమితమైన రేట్లకు ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కర్నూలులో 100, ఆదోనిలో 15, పత్తికొండలో 4 బాణాసంచా స్టాళ్లను ఏర్పాటుచేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఆయా పట్టణాల్లో స్టాళ్ల సంఖ్యను పెంచారు. ఇదేక్రమంలో స్టాళ్లలో బాణాసంచా రేట్లను కూడా విపరీతంగా పెంచడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఏకంగా 25 శాతం వరకు రేట్లు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఒక్కో కుటుంబంపై దాదాపు 3–5 వేల వరకు అదనపు భారం పడుతోంది. మరోవైపు స్థానిక క్రాకర్స్ మర్చంట్ ప్రోద్బలంతోనే రేట్లు పెంచి అముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్టాళ్లలో షాపు ఏర్పాటు చేసుకోవాలంటే అసోసియేషన్కు రూ.20 వేలు, జీఎస్టీ పేరిట రూ.20 వేలు, మునిసిపాలిటీకి రూ.5 వేలు, అదనపు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా డబ్బులతోపాటు పెట్టుబడి, నాలుగు రోజుల నిర్వహణ ఖర్చులు, లాభాల కోసం రేట్లను పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాగా, షాపుల్లో మాత్రం 80–90 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నా వినియోగదారుడికి మాత్రం రేట్లు తగ్గడంలేదు.
వ్యాపారాలు తగ్గాయంటున్న వ్యాపారులు
మరోవైపు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అసోసియేషన్కు రూ.46 వేలు కట్టి స్టాల్ను ఏర్పాటు చేసిన వ్యాపారాలు జరగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలుకు సమీపంలోని వెల్దుర్తిలో క్రాకర్స్ తయారీ కేంద్రం ఉండడంతో వినియోగదారులతోపాటు వ్యాపా రులు అక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో ఇక్కడ కంటే అక్కడే తక్కువ బాణాసంచా విక్రయాలు జరుగుతుండడంతో అక్కడే వెళ్లి తెచ్చుకుంటున్నారని, ఫలితంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వారు కనీసం అసోసియేషన్కు చెల్లించినా డబ్బులైనా వస్తాయా లేదా అన్న మీమాంసలో ఉన్నారు.
గ్రీన్కాకర్స్ను మాత్రమే కాల్చాలి
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో గ్రీన్ కాకర్స్ను మాత్రమే అమ్మేలా వ్యాపారులకు నిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టరు, ఎస్పీ, జిల్లా అగ్నిమాపక అఽధికారి, ఆర్డీఓలు, కాలుష్య నియంత్రణ మండలి, మునిసిపల్ అధికారులు బాణసంచా వ్యాపారులతో సమావేశాలను నిర్వహించుకొని ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పండుగరోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య బాణసంచాను పేల్చాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
జీఎస్టీ తగ్గినా రేట్లు అధికమే
కనీసం రూ.5 వేలు వెచ్చించాల్సి
వస్తోందని ప్రజల ఆవేదన
విపరీతమైన ధరలతో వేడుకలకు
దూరంగా పేద,
మధ్యతరగతి వర్గాల ప్రజలు