
నేతల ఆదేశం.. పోలీసుల గులాం!
‘సాక్షి’పై అక్రమ కేసుల పరంపర
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినా ఎవరూ ప్రశ్నించకూడదు. అలాచేస్తే అక్రమ కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురిచేసి మీడియాను లొంగదీసుకునే చర్యలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘సాక్షి’పై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో కర్నూలులో ఈ 15 నెలల్లో నాలుగు అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. గత నెల 13న ‘సాక్షి’లో ‘క్యాంపు భరతం పట్టేస్తా!’ శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది. కర్నూలులోని బీ, సీ క్యాంపు స్థలాల్లో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఆ ముసుగులో ఇద్దరు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు స్థలాలను లీజు పేరిట కొట్టేయడానికి కుట్ర పన్నుతున్నారనేది ఆ వార్త సారాంశం. కథనంపై బి.నవీన్కుమార్ అనే వ్యక్తి త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ‘సాక్షి’పై ఫిర్యాదు చేశారు. ‘సాక్షి’లో కథనం చదివి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బీ, సీ క్యాంపులో సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారని, వీరంతా నక్సలైట్లుగా మారే అవకాశం ఉందని, మంత్రి టీజీ భరత్కు నష్టం చేకూర్చేలా కథనం రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో సాక్షి మేనేజ్మెంట్, సాక్షి పబ్లిషర్పై క్రైం నెంబర్ 419/20225 కింద సెక్షన్ యూ/ఎస్192, 352,353 (1),(బి),356(1),61(1) (ఏ) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే రెండో పట్టణ పోలీసుస్టేషన్లో సెక్షన్ 192, 356(1),352,353(1)(బి)61(1)(ఏ)రెడ్విత్ 3(5) బీఎన్సీపై మరో కేసు నమోదు చేశారు. నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు త్రీటౌన్లో, శరత్బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టూటౌన్లో కేసులు నమోదయ్యాయి.
జాతీయ స్థాయిలో తప్పుపట్టినా మారని వైఖరి
‘సాక్షి’ పత్రికపై, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్లో అక్రమ ంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నేతలు, జర్నలిస్టు యూనియన్లతో పాటు జాతీ య స్థాయిలో ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. అయినప్పటికీ కూటమి పార్టీలు ఎలా చెబితే అలా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కర్నూలులో నమోదు చేసిన కేసు కూడా మంత్రి టీజీ భరత్ ప్రోద్భలంతోనే నమోదైనట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూలై 26, 2025
కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308(3), 353(1)(బి), 356(3), రెడ్విత్ 61(2)బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. డీఐజీ సీసీ రత్నప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఆ కేసు నమోదు చేశారు. ఏ1–గా సాక్షి బ్యూరో, ఏ2గా సాక్షి మేనేజ్మెంట్, పబ్లిషర్ పేరును చేర్చారు. కథనంలో ఎక్కడా కర్నూలు డీఐజీ అని కానీ, డీఐజీ పేరు కానీ రాయలేదు. పైగా సీసీ రత్నప్రకాశ్ ఈ కథనంతో ఎలా బాధితుడు అవుతారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదు చేస్తారని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో
నాలుగు అక్రమ కేసులు
త్రీటౌన్లో 2, టూటౌన్లో ఒకటి,
ఉలిందకొండలో మరో కేసు నమోదు
‘సాక్షి’ యాజమాన్యం,
పబ్లిషర్, బ్యూరోపై కేసు నమోదు చేసిన
కర్నూలు పోలీసులు
మంత్రి టీజీ భరత్కు వ్యతిరేకంగా
వార్త రాశామని రెండు స్టేషన్లలో
కేసు నమోదు
డీఐజీపై వార్తలు రాశారని
మరో రెండు కేసులు
డిసెంబర్ 22, 2024
కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పని చేస్తున్న స్కూలుకు పోలీసులు వచ్చి కిడ్నాప్ చేశారని, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే వ్యవహారం జరిగిందని, పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పని లేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని విలేకరులకు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రముఖ ఛానెళ్లు, పత్రికలు ప్రచురించాయి. కానీ అప్పుడు కూడా ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదు చేశారు. కిడ్నాప్ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం రాస్తే త్రీటౌన్ హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తన విధులకు సాక్షి విలేకరి ఆటంకం కలిగించారని తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం గమనార్హం.