వీరులపాడు: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో శుక్రవారం రాత్రి కుక్క దాడిలో మహిళ, నాలుగేళ్ల బాలునితో పాటు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన దేవరకొండ సుబ్బయ్య, లింగాల చరణ్ రేవంత్, మాదాల రాజు నరేంద్ర, కలకొండ వెంకట నరసమ్మ, మిటికల నాగరత్నం, విడియాల రేవంత్ అరుణ్, నీలం శోభనాద్రి, తమ్మిశెట్టి బూదమ్మ, షేక్ వలి, మన్యం వరలక్ష్మీలను మండలంలోని అల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పంచాయతీ, వైద్యారోగ్య శాఖాధికారులు, సిబ్బంది బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పిచ్చి కుక్కలను నియంత్రించాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గన్నవరం: ఒంటరి మహిళ హత్య కేసులో నిందితులైన ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల సమాచారం ప్రకారం... దావాజిగూడెం రోడ్డులోని జీకెఆర్ పారడైజ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కాజ రజితకుమారి ఈ నెల 24వ తేదీరాత్రి హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు ఆమెను హత్య చేసిన పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు అజయ్కుమార్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇరువురు నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం సుష్మ, అజయ్కుమార్ను రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్జైలుకు తరలించారు.
కంచికచర్ల: జాతీయ రహదారిపై కంకరలోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొనటంతో ట్రాక్టర్ డ్రైవర్కు తీవ్ర గాయాలైన టన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ రాతి క్వారీల నుంచి కంకరను లోడింగ్ చేసుకుని నేషనల్ హైవేకు ట్రాక్టర్ చేరింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లుతున్న ప్రవేటు బస్సు వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ పల్టీకొట్టగా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకటనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి ఏ ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


