టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ
బందరు కూటమిలో ముసలం వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుపై వివాదం తోపులాటలకు దిగిన టీడీపీ, బీజేపీ శ్రేణులు సర్కిల్ వద్ద బైఠాయించిన ఇరు పార్టీల నాయకులు
సర్కిల్ వద్ద పోటాపోటీగా నినాదాలు చేస్తున్న టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల మధ్య ముసలం వచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రేగిన వివాదం ఇరు పార్టీల నాయకులు తోపులాటలు, నల్లజెండాలతో నిరసనలు, నినాదాలు, బైఠాయింపుల వరకు వెళ్లింది. ఈ ఘటన సోమవారం నగరంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అతుల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు సోమవారం ఉదయం టెంకాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సర్కిల్లో టీడీపీ నాయకులు నిలబడి బీజేపీ నాయకులు శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు సర్కిల్ బయట రోడ్డుపై టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకులకు పోటీగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించే ప్రయత్నం చేయగా చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు నల్లజెండాలను పట్టుకుని జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీ ఆర్... జోహార్ ఎన్టీఆర్... అంటూ నినాదాలు చేయగా, బీజేపీ నాయకులు జోహార్ వాజ్పేయి అంటూ పోటీగా నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 2014లోనే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశామని, ఈ సర్కిల్కు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం కూడా చేశామని చెప్పారు. ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది. ఈ వ్యవహారాన్ని బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకుల దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ పోటాపోటీ ఆందోళనలో టీడీపీ తరఫున జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, నాయకులు పంతం గజేంద్ర, నాగలింగం అయోధ్య రామచంద్రరావు (రాము) సోడిశెట్టి బాలాజీ, వైవీఆర్ పాండురంగారావు, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ, బీజేపీ ఢీ అంటే ఢీ


