
ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఎ.శాస్త్రి అధ్యక్షతన శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా గోపిమూర్తి మాట్లాడుతూ.. ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.మోహనన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెన్షనర్లు పీఆర్సీ లబ్ధి పొందకుండా పెన్షన్ రీవాల్యుడేషన్–2025 బిల్లు తీసుకురావడం అన్యాయమన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసో సియేషన్ నాయకుడు ఎం.జనార్దన్రెడ్డి మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తీర్మానాలను ప్రవేశపట్టి భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్లు తరపున ఎమ్మెల్సీ గోపిమూర్తికి వినతి పత్రం అందజేశారు. బ్యాంకు పెన్షనర్స్ సంఘం నాయకుడు ఎం.రామారావు, రైల్వే పెన్షన్ సంఘం నాయకుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.