
జైల్లో పరిచయం.. ముఠాగా దొంగతనం
గుడివాడరూరల్: జైలులో ఖైదీలుగా ఉంటూ స్నేహితులుగా మారి.. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను పామర్రు, గుడివాడ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పామర్రు మండలం మలయప్పన్ పేటలో నివాసముంటున్న సాలిమట్టి ప్రమీలరాణి ఇంట్లో సుమారు రూ.5 లక్షల విలువైన 16 కాసుల బంగారు నగలతో పాటు సెల్ఫోన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 22న రాత్రి ఐదుగురు వ్యక్తులు చోరీ చేసి పారిపోతుండగా చప్పుడు కావడంతో పక్కనే ఉంటున్న వారు లేచి వారి వెంటపడ్డారు. వారు ఐదుగురు రెండు మోటార్ సైకిళ్లపై గుడివాడ వైపు పారిపోయారు. దీనిపై ఫిబ్రవరి 23న పామర్రు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పామర్రు సీఐ వి.సుభాకర్, ఎస్ఐ వి.రాజేంద్ర ప్రసాద్ రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్ ఐఎంఈఐ నంబర్లు, సిగ్నల్స్ ఆధారంగా సీసీ కెమెరాల్లోని ఆధారాలతో దొంగలను గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన కాకినాడకు చెందిన కొటారి శ్రీనివాస్(36), గుడివాడ నైజాంపేటకు చెందిన తిరుమలశెట్టి ధనుష్(పాండు 18), బేతవోలుకు చెందిన ప్రత్తిపాటి సంజయ్(19)లను అదుపులోకి తీసుకోగా.. ఉయ్యూరుకు చెందిన అబ్దుల్ షబ్బీర్(19)ని మార్చి 25వ తేదీన, ఏలూరుకు చెందిన ఎస్కే మున్న అలియాస్ సిరి(19, ట్రాన్స్జెండర్)లను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. బాధితులు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ చోరీలకు పాల్పడుతున్న దొంగలపై విజయవాడ, ఏలూరు జిల్లా కై కలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 110 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
జైలులో స్నేహం..
ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు గుడివాడకు చెందిన గొడవర్తి కిరణ్ అలియాస్ లిక్క గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడి జైలుకి వెళ్లిన క్రమంలో మిగిలిన వారితో స్నేహం ఏర్పడిందని డీఎస్పీ వివరించారు. వీరందరూ కలసి గుడివాడలో మద్యం, గంజాయి తాగేందుకు వచ్చి ఈ చోరీలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్న పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ రాజేంద్రప్రసాద్, సీసీఎస్ఐ సీఐ రమణమ్మ, స్వామిదాస్, సీసీఎస్ హెడ్కానిస్టేబుల్స్ సీహెచ్ రాంబాబు, ఎ.మస్తాన్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించిన నగదు రివార్డులను అందజేశారు.
ఐదుగురు అంతర్ జిల్లాల దొంగలను
పట్టుకున్న పోలీసులు