
సాయం కరువు!
అదును మొదలు..
అన్నదాత సుఖీభవ అమలు ఎప్పుడో?
ఆర్థిక సాయం అందించాలి..
ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఆర్థిక సాయం తప్పని సరిగా అందించాల్సి ఉంది. ఇప్పటి నుంచే రైతులు పొలాల్లో పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక తోడ్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.
– గౌరిశెట్టి నాగేశ్వరరావు, కృష్ణాజిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి
ఎదురుచూపులు..
నాడు వైఎస్ జగన్ రైతులకు చెప్పిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందే గాని ఇంత వరకు అమలు చేయలేదు. నేడు ఆర్థిక సాయం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
– గణేశన రమేష్, రైతు, ఎస్.ఎన్. గొల్లపాలెం, బందరు మండలం
చిలకలపూడి(మచిలీపట్నం): ఖరీఫ్ సీజన్ సమీపించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు కాస్త ముందుగానే ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే వారికి ప్రభుత్వం నుంచి సాయం కరువవుతోంది. ఇప్పటికే రబీ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో వారు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా వారికి రూ. 20వేలు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఆ సాయాన్ని అందించలేదు. ఎప్పటికి ఇస్తారో కూడా తెలియడం లేదు. దీంతో రైతులు ఖరీఫ్ సాగుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభం నుంచి రైతులకు భరోసా అందిస్తూ ఆర్థికంగా అండగా నిలిచింది.
గత ఐదేళ్లలో రూ. 572.22కోట్లు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అండగా నిలిచింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయం అందించింది. జిల్లాలో ఐదేళ్లలో రూ.572.22 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేసి, సరైన సమయానికి ఆదుకుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయ లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు హడావుడి మొదలు పెట్టింది. అర్హుల జాబితాలంటూ వెరిఫికేషన్లను ప్రారంభించింది. అయితే ప్రక్రియంతా పూర్తయ్యి సొమ్ము ఖాతాల్లో జమయ్యే పాటికి అదును వెళ్లిపోతుందేమో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 1,67,667 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
రబీ సీజన్లో నష్టపోయిన రైతులు..
రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు వారు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎకరానికి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఏ ప్రాంతంలోనూ కొనుగోలు చేయలేదు. ఏదో ఒక నెపంతో తక్కువ ధరకు కొనుగోలు చేసింది. మరో పక్క దళారులు రైతుల వద్ద నుంచి మరింత తక్కువకు ధాన్యం కొనుగోలు చేశారు. ఇటు వంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్లోనైనా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సంవత్సరం రైతుల సంఖ్య నగదు (రూ.లలో)
2019–20 1,31,595 108.09 కోట్లు
2020–21 1,44,280 110.82 కోట్లు
2021–22 1,50,099 115.00 కోట్లు
2022–23 1,52,112 118.74 కోట్లు
2023–2024 1,56,827 122.55 కోట్లు
పొలాలను సిద్ధం చేసుకుంటున్న రైతులు జిల్లాలో 1,67,667 హెక్టార్లలో సాగుకు ప్రణాళిక పెట్టుబడి సాయంపై వీడని సందిగ్ధత గత ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 572.22 కోట్లు అందించినవైఎస్సార్ సీపీ ప్రభుత్వం
గత ఐదేళ్లలోవైఎస్సార్ సీపీ ప్రభుత్వ రైతు భరోసా పథకం అమలు ఇలా..
పరిశీలిస్తున్నాం..
అన్నదాత సుఖీభవకు సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను పరిశీలన చేస్తున్నాం. ఇది పూర్తయిన తరువాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. తదానంతరం వారు పరిశీలన చేసి అర్హుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
– మనోహర్, జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జి అధికారి

సాయం కరువు!

సాయం కరువు!