
యోగాంధ్రలో జిల్లాను నంబర్ వన్గా నిలుపుదాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్దీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని.. మీడియాతో పాటు ప్రతి వర్గం సమష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదా పు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఏడుగురు ట్రైనర్లు అందుబాటులో ఉంటారని.. ఒక్కో ట్రైనర్ ఒక సెషన్కు 50 మందితో యోగాభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు.
థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు..
మన భారతీయ వారసత్వ, సాంస్కృతిక సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లాలోనూ నెల రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 24న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం ప్రారంభమై జూన్ 20న సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్తో యోగాభ్యసన కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు.
ప్రత్యేక పోటీల నిర్వహణ..
యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్, మండల స్థాయిలో యూనిటీతో యోగా, జిల్లాస్థాయిలో యోగా అండ్ యూత్ ఇతివృత్తాలతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు అవార్డుల బహూకరణ ఉంటుందన్నారు. పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం. సుహాసిని, డాక్టర్ జె.సుమన్, ట్రైనర్లు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ