విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న 32 వ జాతీయ సంగీతోత్సవాలు శ్రావ్యంగా సాగుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమంలో కె.శర్వాణి, సహాన, జనని, కె.శ్రావ్య శివానీ, ఓరుగంటి లక్ష్మి, సురవరపు విద్య, అనీష్ మీనన్, ఎన్.భవ్యశ్రీ గీతిక, సాత్వికా మోహన్, బి.రఘునాథరావు త్యాగరాజ స్వామి రచించి, స్వరపరచిన కీర్తనలను ఆలపించారు. కరణా జలధే, రారా మాయింటి దాకా, గిరిరాజ సుతా తనయ, సామజవరగమన, పట్టి విడువరాదు తదితర కీర్తనలు శ్రోతలను రంజింపజేశాయి. త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవంలో 6 సంవత్సరాల చిన్నారి నుంచి 80 ఏళ్ల విద్వాంసుల వరకు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, కార్యదర్శి పోపూరి గౌరీనాఽథ్, సభ్యులు గాయత్రి గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రావ్యంగా సాగుతున్న జాతీయ సంగీతోత్సవాలు ఆరేళ్ల చిన్నారి, 81 ఏళ్ల వయోవృద్ధ సంగీత విద్వాంసుల గానామృతం త్యాగరాజ కృతులను మధురంగా ఆలపిస్తున్న వైనం
సంగీత ప్రియులకు షడ్రసోపేత విందు