ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగా లను ఎప్పటికీ మరువలేమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రజల శాంతిభద్రతల రక్షణకు జిల్లా పోలీసుశాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రభుత్వ గుర్తింపు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్ పాల్గొన్నారు.


