ఈ నెలాఖరు వరకు ఒంటిపూటే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింపు ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మే నెలంతా సెలవులు..
కెరమెరి: ఉదయం తొమ్మిది దాటితే చాలు వడగాలు లు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పెద్దలే బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పసిపిల్లలు, గర్భిణులు ఎదుర్కొంటున్న ఇ బ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల వేళల్లో మార్పులు చేస్తూ చిన్నారులకు ఊరటనిచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలలకు గత నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. పాఠశాల విద్యార్థుల కంటే అతి పిన్న వయస్సు గల చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించా లంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలి చ్చింది. ఈ నెల 30 వరకు ఒంటిపూట నిర్వహించనున్నారు. బుధవారం నుంచి జిల్లాలోని 1006 అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 నుంచి 12.30 వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. గతేడాది మార్చి 15 నుంచే పాఠశాలలతో పాటే అంగన్వాడీ కేంద్రాలకు సైతం ఒంటిపూట బడులు ప్రారంభం కాగా, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులకు ఉపశమనం లభించింది.
మే నెలంతా సెలవులు
ఈ నెలాఖరు వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. మే నెలంతా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు సెలవులు ప్రకటించారు. గతంలో ఏప్రిల్ 30 వరకు రెండు పూటలు బడులు కొనసాగగా.. మే నెలలో 15 రోజులు అంగన్వాడీలు, మరో 15 రోజులు ఆయాలు విధులు నిర్వర్తించేవారు. వేసవిలో మండే ఎండలతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పెరుగుతున్న ఎండల దృష్ట్యా మేలో పూర్తిగా కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
0– 5 ఏళ్ల పిల్లల సర్వే
జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 0– 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల వార్షిక సర్వే చేపట్టాలి. సర్వే, ఇంటి సందర్శనలు, ప్రీ స్కూల్ పిల్లల నమోదు, బడి మానేసిన వారిని తిరిగి బడిలో చేర్చుకోవడం తదితర పనులు చేపట్టి నివేదికలు సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా, ప్రజాపాలన సందర్భంగా మే 25 నుంచి 30 వరకు మహిళా ఇతివృత్తంతో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో సూచించింది.
అసౌకర్యాల మధ్య..
ఇప్పటి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను తెరిచేవారు. సరైన సౌకర్యాలు, సొంత భవనాలు లేని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న వందలాది అంగన్వాడీ కేంద్రాల్లో ఎండలకు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన నీటి సదుపాయం కూడా లేదు. చిన్నారులు భోజనం చేశాక నీటి కోసం చేతిపంపుల వద్దకు పరుగులు పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఈ సమస్య ఉంది. రెండేళ్ల క్రితం ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు మంజూరైనప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేక అలంకారప్రాయంగా ఉన్నాయి. ఫ్యాన్లు అమర్చినా ఎందుకూ పనికిరాకుండా పోయా యి. ఈ నేపథ్యంలో ఒంటిపూట నిర్వహణ ఊరట కలిగించనుంది.


