అడ్డగోలుగా ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా ఆక్రమణలు

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

● రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు వ్యాపార సముదాయాలు రోడ్డుకు ఆనుకుని ఉన్నాయి. రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండటంతోపాటు తోపుడు బండ్లపై వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి ఇరువైపులా ఇరుకుగా రోడ్డు ఉంది. ద్విచక్ర వాహనదారులు ఈ దారి లో ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలవుతున్నారు. ● మార్చి 12న 108, 104 వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బుక్కరాములు మెడికల్‌ సమీపం రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్‌ చేయడంతో రోగులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చే దారిలో అంబులెన్సుకు దారి లేకుండా పోయింది. అంబులెన్స్‌ తిరిగి గాంధీచౌక్‌ దారి నుంచి వెళ్తుండగా అటుగా వాహనాలు నిలిపి ఉండడంతో ఏమీ చేయలేక వాహనాన్ని వెనక్కి మళ్లించారు. మార్కెట్‌ ఏరియా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా ఆస్పత్రికి చేరుకోవాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో ఈ మార్గంలో క్షతగాత్రులు, రోగులకు అవస్థలు తప్పడం లేదు.

కాగజ్‌నగర్‌లో రోడ్లకు ఇరువైపులా అక్రమ కట్టడాలు ట్రాఫిక్‌ చిక్కులతో ప్రజలకు నిత్యం నరకం స్వచ్ఛందంగా తొలగించాలని మున్సిపల్‌ అధికారుల ప్రకటన

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాలకు ఇరువైపులా కొందరు రోడ్లు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో సుమారు 70వేల జనాభా ఉంది. అక్ర మ నిర్మాణాలతో ఏళ్లుగా జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ఫలితంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు, అంబులెన్స్‌లు దారుల్లో చిక్కుకుపోతున్నాయి. ఈ తరుణంలో యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు. ఇది ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ఆక్రమణలు ఇక్కడే..

పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ ఏరియా, తెలంగా ణ తల్లి చౌరస్తా నుంచి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, భట్టుపల్లి చౌరస్తా, రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తాల మీదుగా సంజీవయ్య కాలనీ వరకు, అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి ఎల్లాగౌడ్‌ తోట ప్రభుత్వ ఆస్పత్రి, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. వివిధ కాలనీల నుంచి మార్కెట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు రెండువైపులా దుకాణాలు నిర్మించగా, చిరువ్యాపారులు తోపుడు బండ్లు రోడ్లపైనే పెడుతున్నారు.

పెండింగ్‌లోనే తొలగింపు ప్రక్రియ

పట్టణంలో ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాల ను ఇంకా తొలగింపునకు నోచుకోవడంలేదు. పలు మార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుండడంతో పట్టణ ప్రజలు అసహనానికి గురవుతున్నారు. 2019 మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణంలోని ప్రజారవాణాలు, కాలువలు, ఫుట్‌పాత్‌లపై ఎటువంటి ఆక్రమణలు అనుమతించరాదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. నిర్ణీత గడువులోగా స్వ చ్ఛందంగా తొలగించకపోతే మున్సిపాలిటీ బలవంతంగా తొలగించే అధికారం సైతం ఉంటుంది. ప్రజ ల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతుంది. అవసరమైతే జరిమానాల ఖర్చులను సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయవచ్చు. ఇప్పటికై నా పట్టణంలోని ఆక్రమణలను పూర్తిగా తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement