మున్సి‘పోల్స్’కు భారీ బందోబస్తు
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించనున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణంలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. మద్యం, నగదు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువుల తరలింపును అడ్డుకునేందుకు రెండు పట్టణాల్లో నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతూ భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు. జిల్లాలో 34 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా, ఆసిఫాబాద్లో 17, కాగజ్నగర్లో 17 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలపై మరింత నిఘా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
సిబ్బంది కేటాయింపు ఇలా..
ఎన్నికల నిర్వహణకు 800 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో నలుగురు డీఎస్పీలు, ఏఎస్పీ స్థాయి అధికారులు, 12 మంది సీఐలు, ఆర్ఐలు, 38 మంది ఎస్సైలు, 108 మంది టీజీఎస్పీ ప్రత్యేక బెటాలియన్ పోలీసులు, 516 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 75 మంది హోంగార్డులు, 25 మంది అటవీశాఖ సిబ్బంది, జైళ్లశాఖ, ఆర్టీసీ, పీటీఎస్, మెట్రాలజీ సిబ్బందిని కేటాయించారు. 10 రూట్ మొబైళ్లు, 306 స్ట్రైకింగ్ ఫోర్స్, రెండు ఎఫ్ఎస్టీ బృందాలు, 4 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా విచక్షణతో ఓటు వేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు.
పోలింగ్ కేంద్రాలు తనిఖీ
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎస్పీ నితిక పంత్ తనిఖీ చేశారు. ఆసిఫాబాద్లోని జెడ్పీ సెకండరీ పాఠశాల(బాలికలు), జెడ్పీఎస్ఎస్ ఉర్దూ, జెడ్పీ సెకండరీ ఉన్నత పాఠశాల (బాలుర), కాగజ్నగర్లోని శిశుమందిర్ ఉన్నత పాఠశాల, సుప్రభాత్ పాఠశాల, బాలభారతి పాఠశాల, అన్వర్ ఉర్దూ ఉన్నత పాఠశాల, స్మైల్ కిడ్స్ పాఠశాలల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు.


