మొదటి విడత పోలింగ్కు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఈనెల 11న జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా ఈనెల 11న నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సరిపడే కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది ముందురోజు సాయంత్రం 4 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని, ఎన్నికల్లో ఉపయోగించే సామగ్రి, కవర్లు, పేపర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను సరి చేసుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం పంపిణీ కేంద్రంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది తాగునీరు, అల్పాహారం, భోజనం సమయానికి అందించాలన్నారు. జోనల్ అధికారులు తమ రూట్ పరిధిలోని ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. స్టేజ్ –2 ఆర్వో, పీవోలకు ఈ నెల 9న ఎన్నికలు జరిగే మండల కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించాలని తెలిపారు. ఈ నెల 10న ఉదయం 9 గంటలకు పోలింగ్ సిబ్బంది సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేసేలా చూడాలన్నారు. రూట్ల వారీగా అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పూర్తి బందోబస్తు మధ్య ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో బిక్షపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


