
● పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ● ఎంపీటీసీ, జెడ్ప
ఆసిఫాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించడంతో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణను గురువారానికి వాయిదా వేసినా.. నోటిఫికేషన్ విడుదలకు హైకోర్టు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. దీంతో నామినేషన్ల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. జిల్లాలోని 345 పోలింగ్ కేంద్రాల పరిధిలో 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 335 గ్రామ పంచాయతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు.
రెండు విడతల్లో ఎన్నికలు
ఈ నెల 23న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్నగర్, రెబ్బెన, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి మండలాల్లోని ఏడు జెడ్పీటీసీ స్థానాలు, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేర్వేరుగా నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలివిడత జెడ్పీటీసీ నామినేషన్లకు 8 మంది రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీసీ నామినేషన్లకు 40 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు.
ఆశావహుల్లో ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు గురువారం తీర్పునిచ్చే అవకాశం ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. క్షేత్రస్థాయిలో మంతనాలు జరపగా, త్వరలో జాబితాను ఫైనల్ చేయనున్నాయి. కాగా, 2016లో కుమురంభీం ఆసిఫాబాద్ కొత్త జిల్లాగా ఏర్పడగా తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఎస్టీలకు కేటాయించారు. తాజా రిజర్వేషన్లతో బీసీ జనరల్కు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు దక్కే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు అమలవుతాయా.. లేక పాతవే కొనసాగుతాయనే సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు తీర్పు కీలకం కానుంది.
నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం
ఆసిఫాబాద్: సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, పోలీ సు అధికారులు, ఎన్నికల అధికారులు, జిల్లా ప రిషత్, పంచాయతీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, ఇతర అంశాలకు సంబంధించి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 8 జెడ్పీటీసీలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇప్పటికే సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
ముఖ్య ఘట్టాలు తొలి విడత రెండో విడత
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 09 అక్టోబర్ 13
చివరి తేదీలు అక్టోబర్ 11 అక్టోబర్ 15
పరిశీలన అక్టోబర్ 12 అక్టోబర్ 16
ఉపసంహరణ అక్టోబర్ 15 అక్టోబర్ 19
ఎన్నికల తేదీలు అక్టోబర్ 23 అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు నవంబర్ 11 నవంబర్ 11

● పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ● ఎంపీటీసీ, జెడ్ప

● పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ● ఎంపీటీసీ, జెడ్ప