
5న జిల్లాకు కేంద్ర మంత్రి ‘గడ్కరీ’
● ఎంపీ గోడం నగేశ్
రెబ్బెన(ఆసిఫాబాద్): జాతీయ రహదారి– 363 ప్రారంభోత్సవానికి ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాకు రానున్నారని ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద గల వాసవీ జిన్నింగ్ మిల్లులో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల బీజేపీ నాయకులతో గురువారం ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించి జాతీయ రహదారిని కేంద్ర మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. సభాస్థలి వద్ద పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆసిఫాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.