సలహాలు కరువు | - | Sakshi
Sakshi News home page

సలహాలు కరువు

May 31 2025 1:16 AM | Updated on May 31 2025 1:16 AM

సలహాలు కరువు

సలహాలు కరువు

సాగు మొదలు..
● జిల్లాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ లేనట్లే..! ● కేవీకే లేకపోవడంతో ప్రారంభం కాని కార్యక్రమం ● వర్షాలతో విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధం ● అవగాహన సదస్సులు నిర్వహించాలని విన్నపం

పత్తి సాగుకు దహెగాం శివారులో సిద్ధం చేసిన దుక్కి

దహెగాం(సిర్పూర్‌): వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్పిడి, భూసారానికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలి.. తదితర విషయాలను శాస్త్రవేత్తల ద్వారా రైతులకు వివరించడం ఈ కార్యక్రమం ము ఖ్య ఉద్దేశం. అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగా.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ప్రారంభించలేదు. ఓ వైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండగా, వర్షాలతో రైతులు సాగు పనులు చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో అన్నదాతలు ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. 1.48 లక్షల మంది రైతులు ఉన్నారు. సాగునీటి సౌకర్యం లేక అన్నదాతలు అధికంగా వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా పంటలు నష్టపోతున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వంగడాలను ఎంచుకోకపోవడంతో అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. జిల్లా రైతులు ప్రధానంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. వరి 58 వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీటి వనరులు లేకపోవడంతో పత్తి, జొన్న, కంది, సోయా తదితర పంటలు పండిస్తున్నారు.

ముందుకు సాగని కేవీకే పనులు

జిల్లాలోని రైతులకు శాసీ్త్రయ పద్ధతుల గురించి వివరించడం, నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఏడాది జనవరిలో జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరైంది. కౌటాల మండలం కనికి గ్రామం వద్ద అధికారులు భూమిని సైతం పరిశీలించారు. అయినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్‌, బెల్లంపల్లిలో కేవీకేలు ఉండగా, శాస్త్రవేత్తలు ఆయా జిల్లాలకే పరిమితమవుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం లేకపోవడంతోనే జిల్లాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం చేపట్టలేదని తెలుస్తోంది. దీంతో చాలామంది రైతులు పాత పద్ధతులతోనే పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు కోరుతున్నారు.

రైతులకు అవగాహన

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సలహాలు, సూచనలు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఈ నెల 5 నుంచి జూన్‌ 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి సాగులో తీసుకోవాల్సి న జాగ్రత్తలు వివరిస్తున్నారు. యూరియా ఏ మోతాదులో వాడాలి.. పంట మార్పిడి, మందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర విషయాలపై అవగాహ 1న కల్పిస్తున్నారు. ప్రధానంగా ఆరు అంశాల గురించి వివరిస్తున్నారు. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలు వినియోగించి నేల తల్లిని ఆరోగ్యంగా ఉంచడం, రశీదులు భద్రపరచి పరిహారం పొందడం, సాగు నీటిని ఆదా చేసి భావితరాలకు అందించడం, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడడం.. వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement