
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
● ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్
ఆసిఫాబాద్అర్బన్: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ హెచ్చరించారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, నేరా ల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ‘డయల్ 100’ ద్వారా వచ్చిన ఫోన్కాల్స్కు వేగంగా స్పందించి నేరాల ను నియంత్రించాలని సూచించారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. శనివారం నిర్వహించనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతీ పోలీ స్స్టేషన్ పరిధిలో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, సీఐ లు, ఎస్సైలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జోడేఘాట్ను సందర్శించిన ఎస్పీ
కెరమెరి: ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ శుక్రవారం జోడేఘాట్ను ఆదివాసీ నాయకులతో కలిసి సందర్శించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంను సందర్శించారు. ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ఆదివాసీ జిల్లా ప్రజల కోసం పని చేస్తానని, మారుమూల గిరిజన గ్రామాల్లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సాయం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు సత్యనారాయణ, రాణా ప్రతాప్, ఎస్సై మధుకర్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.