
విత్తనంపై దళారీ పెత్తనం!
కౌటాల: నకిలీ విత్తనాల దందా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు అక్కడక్కడా పట్టుకుంటున్నా.. మోసాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ఏటా వానాకాలంలో అత్యధికంగా 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి పంటలు సాగు చేస్తుంటారు. దీనిని ఆసరా చేసుకున్న దళారులు జిల్లాలో కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందాను మొదలుపెట్టారు. ఈ దందా జిల్లాలోని సరిహద్దు మండలాల్లో ‘మూడు విత్తనాలు.. ఆరు కాయలు’గా సాగుతోంది. దందా విషయం స్థానిక పోలీసులకు తెలిసినా మామూళ్ల కారణంగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏటా క్వింటాళ్ల కొద్ది నకిలీ విత్తనాల అమ్మకాలు సాగినా.. పోలీసులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో సుమారు రూ.కోటి విలువైన దాదాపుగా 3 వేల కిలోలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. దీంతో జిల్లాలో ఏస్థాయిలో నకిలీ విత్తనాల దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఏటా దందా..!
జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం రైతులను కలవర పెడుతోంది. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలు పొలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలో బీజీ–1, బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలనే ఆంక్షలు ఉన్నాయి. భూసారం దెబ్బతినడంతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో బీజీ–3 రకాలను నిషేధించారు. అయితే వీటిని దళారులు బీజీ–3 అయితే పంట దిగుబడి పూర్తయ్యేంత వరకు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, దిగుబడిసైతం బీజీ–2 కంటే 30 శాతం ఎక్కువగా వస్తుందని రైతులను నమ్మిస్తూ అంటగడుతున్నారు. జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్(టి), సరిహద్దు మండలాలు కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతుందని ఆరోపణలున్నాయి. నాణ్యమైన బీజీ–2 విత్తనాలే నాటాలని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై వ్యవసాయ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.
రైతులను నమ్మిస్తూ.. నకిలీవి అంటగడుతూ..
యథేచ్ఛగా సాగుతున్న దందా
మహారాష్ట్ర నుంచి జలమార్గంలో జిల్లాకు రవాణా
పలుచోట్ల పట్టుబడుతున్న వైనం
నాణ్యమైన విత్తనం ఎంచుకోవాలని అధికారుల సూచన
జిల్లాలో ఇటీవల పట్టుబడిన కేసులు
ఏప్రిల్ 2న చింతలమానెపల్లి మండలంలో ఎల్,బిక్షపతి వద్ద రూ.10.50 లక్షల విలువైన మూడు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు.
బెజ్జూర్కు చెందిన కె.చంద్రశేఖర్ విజయవాడ నుంచి కాగజ్నగర్కు పార్శిల్గా నకిలీ విత్తనాలు తరలించారు. ఏప్రిల్ 4న కాగజ్నగర్ పట్టణంలో నవతా ట్రాన్స్ఫోర్ట్లో రూ.1.57 లక్షల విలువైన 45 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.
ఏప్రిల్ 18న కాగజ్నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాల్లో రూ.3.50 లక్షల విలువైన 100 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.
మే7న పెంచికల్పేట్ మండలంలో రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిని అరెస్టు చేశారు.
మే 24న కాగజ్నగర్ మండలం పెద్దవాగు సమీపంలో ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.
మే 25న బెజ్జూర్ మండలం సుశ్మీర్లో రూ.6 లక్షల విలువైన 170 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లాలో ఈసారి రూ.90 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి నకలీ విత్తనాలు తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి నుంచి నది, రోడ్డు మార్గాల్లో జిల్లాకు తరలిస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
– రాణా ప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ
నది మార్గాల్లో నకిలీ దందా..!
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దళారులు ఖరీఫ్ సీజన్కు ముందే నకిలీ విత్తనాలను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), తదితర మండలాల్లో సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందును పలు ప్రైవేట్ ట్రాన్స్ఫోర్టులు, లారీల్లో జిల్లాకు చేరవేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పలువురు దళారులు గోదాంలను ఏర్పాటు చేసుకుని నకిలీ విత్తనాలు నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి కౌటాల మండల సరిహద్దులోని వార్ధా, ప్రాణహిత నదుల మార్గాన నాటు పడవల్లో మండలాల్లోని సబ్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా ఏటా జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ కేవలం చిన్న మొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్న వారిని మినహా అసలు సూత్రధారులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఆయా శాఖల అధికారులకు దందా చేసే అసలు వ్యక్తులు తెలిసినప్పటికీ ‘మామూలు’గానే వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

విత్తనంపై దళారీ పెత్తనం!