
మా ప్రాణాలకు దిక్కెవరు?
● టైగర్ జోన్ పేరిట అడవులనుంచి వెళ్లగొట్టే కుట్ర ● కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటన వెనక్కి తీసుకోవాలి ● జీవో 49 రద్దుకు కదం తొక్కిన ఆదివాసీలు
ఆసిఫాబాద్అర్బన్: టైగర్ కన్జర్వేషన్ రిజర్వు రద్దు కోసం ఆదివాసీలు కదం తొక్కారు. గత నెల 30న కుమురంభీం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించి జారీ చేసిన జీవో 49 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ‘పులులు వద్దు.. ప్రాణాలే ముద్దు’ అనే నినాదంతో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షకు జిల్లాలోని ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివచ్చారు.
పులులు వద్దు–ప్రాణాలే ముద్దు..
ఆదివాసీ సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్కుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ సిర్పూర్ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొని పులులు వద్దని ఆదివాసీల ప్రాణాలే ముద్దని నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ ఆదివాసీల గొంతు కోసేలా ఉన్న జీవోను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి శ్రీనివాస్, అర్జుమాస్టర్, పెఽందూర్ ధర్ము, జిల్లాలోని ఆదివాసీలు పాల్గొన్నారు. ఎస్పీ కాంతిలాల్ సుభాష్ ఆదేశాలతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీవో 49 ఏమిటి.?
పులుల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమురంభీం పులుల కన్జర్వేషన్ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ జీవో విడుదల చేశారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యా ణి, కాగజ్నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్లలో లక్ష 49వేల హెక్టార్ల ను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించినట్లు పేర్కొన్నారు.