
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఆసిఫాబాద్రూరల్: బాలికల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయంలో ప్రజ్వల స్వచ్ఛంద హైదరాబాద్ ఆధ్వర్యంలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతోపాటు మానవతా విలువలు కూడా నేర్పించాలన్నారు. మైనర్లకు వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక పెరుగుదల మార్పులు, పర్యవసనాలు, బాల్యవివాహాల నిరో ధం, లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వం అందించే సదుపాయాల గురించి వివరించాలని సూచించారు. సైబర్ నేరాలపై లఘు చిత్రాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీసీడీవో భాగ్యలక్ష్మి, ప్రజ్వల స్టేట్ కోఆర్డి నేటర్ మహ్మద్ సిరాజ్, అనిల్ పాల్గొన్నారు.